పోస్కోను అడుగుపెట్టనివ్వను- వైజాగ్ స్టీల్ కార్మికసంఘాలకు జగన్ హామీ
ఏపీలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అసలే ఎన్నికల వేళ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వైసీపీకి కూడా ఇబ్బందిగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంతో రాజకీయంగా కూడా అధికార పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో విశాఖలో పర్యటిస్తున్న సీఎం జగన్ కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు.
మధ్యాహ్నం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడే లాంజ్లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడిన కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నాలు చేస్తోందని సీఎం జగన్ వారికి వివరించారు. దక్షిణకొరియాకు చెందిన పోస్కో సంస్ధకు స్టీల్ ప్లాంట్ను కట్టబెడతారంటూ జరుగుతున్న ప్రచారంపైనా స్పందించిన జగన్ వారిని స్లీల్ ప్లాంట్లో అడుగుపెట్టనివ్వనని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంపై కార్మిక సంఘాల నుంచి సీఎం జగన్ వివరాలు తీసుకున్నారు. అనంతరం తాను ఇప్పటికే ఈ అంశంపై ప్రధానికి లేఖ రాయడంతో పాటు కేంద్రంతో జరుపుతున్న సంప్రదింపులను వారికి వివరించారు. దీంతో కార్మిక సంఘాలు కూడా ప్రైవేటీకరణ ఆపేవరకూ పోరాటం కొనసాగిస్తామని సీఎం జగన్కు తెలిపాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ పోస్కో సంస్ధను కడప, భావనపాడు, కృష్ణపట్నంలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని వెల్లడించారు. కార్మిక సంఘాలతో సీఎం జగన్ భేటీ సందర్భంగా వైసీపీకి చెందిన స్ధానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇతర నేతలు కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications