సభలో సీఎం జగన్ భజన .. దేవుడు, లైఫ్ ఇచ్చారని ఒకరు.. బ్రహ్మ, జీసెస్,అల్లా ..అంతా జగనే అని ఇంకొకరు
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఏపీ శాసనసభ ప్రశంసల వర్షం కురుస్తోంది. సభలో పలు అంశాలపై జరుగుతున్న చర్చ సందర్భంగా పలువురు శాసనసభ్యులు జగన్ భజన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండాదండా అన్నీ జగనేనని, దేవుడని ఓ రేంజ్ లో పైకి ఎత్తేస్తున్నారు. జగన్ పై ఏపీ అసెంబ్లీలో పొగడ్తల డోస్ పెరగడంతో ప్రస్తుతం ఇది ఏపీలో ఇది చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ రాజకీయ ఉగ్రవాదుల పార్టీ ! ఏపి సీఎం జగన్ చిన్న నాటి స్నేహితుడి ఘాటు వ్యాఖ్యలు !!
సీఎం జగన్ ను ఓ రేంజ్ లో పొగిడిన మంత్రి జయరాం .. దేవుడని, అందరు దేవుళ్ళూ జగనేనని వ్యాఖ్య
తాజాగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న బిల్లుపై మాట్లాడుతూ జయరాం చేసిన పొగడ్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జగన్ దేవుడని పేర్కొన్న ఆయన అందరికీ బ్రహ్మ తలరాతను రాస్తాడు అని, తనకు మాత్రం జగన్ తలరాత రాసాడని చెప్పారు. అందుకే మంత్రిని అయ్యానని జగనే తనకు బ్రహ్మ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వాల్మీకి బోయ తెగకు చెందిన వాడినని, తనకు జగనన్న వాల్మీకి అని ప్రశంసల వర్షం కురిపించారు. నామినేటెడ్ పదవులు పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు అంబేద్కర్, ముస్లింలకు అల్లా, క్రిస్టియన్లకు జీసస్ అంటూ ఆకాశానికెత్తేశారు. ఇక చంద్రబాబుకు జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మాట్లాడిన మంత్రి జయరామ్ సీఎం జగన్ పై ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు.
Recommended Video
ఎన్నో కష్టాలకు ఓర్చుకున్న మహానీయుడన్న వైసీపీ ఎమ్మెల్యే .. కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అన్న జనసేన ఎమ్మెల్యే
ఇక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ఎన్నో కష్టాలు పడ్డాడు అని, తప్పు చేయకున్నా ఎన్నో బాధలు అనుభవించారని, ఇక జగన్ అనుభవించిన బాధలు శత్రువుకు కూడా రాకూడదంటూ జగన్ గొప్పతనాన్ని సభా వేదికగా తెలియజేశారు. అంతేకాదు తనలాంటి వ్యక్తులకు జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషమన్న మధుసూదన్ రెడ్డి జగన్ రుణం తీర్చుకోలేము అని చాలా మందికి లైఫ్ ఇచ్చిన అన్న చల్లగా ఉండాలంటూ సభా వేదికగా కోరుకున్నారు. ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల విషయం అటుంచితే జనసేన పార్టీ నుండి ఏకైక ఎమ్మెల్యే గా ఉన్న రాపాక వరప్రసాద్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు.జనసేన ఎమ్మెల్యే రాపాక దేవుడంటూ జగన్ ను ఆయనతో పోల్చేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించటం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
మాటల దాడులు , పొగడ్తలు కాదు కావాల్సింది... ప్రజా సమస్యలపై చర్చ .. వాటికి పరిష్కారం అంటున్న ప్రజలు
అయితే శాసనసభలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పటం వంటి అంశాల కంటే టీడీపీ మీద గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పై దాడి చేయడం, లేదా సీఎం జగన్ ను ఓ రేంజ్ లో పొగడడం మాత్రమే కనిపిస్తున్నాయని ఏపీ ప్రజలు ఈ బడ్జెట్ సమావేశాల మీద కాసింత అసంతృప్తితోనే ఉన్నారు. ప్రజలకు కావాల్సింది మెరుగైన పాలన. అది ఏ ప్రభుత్వం చేసినా సరే.. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రజా సంక్షేమాన్ని కోరుతూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు నడవాల్సిన ప్రభుత్వం అసలు విషయాన్ని మరిచిపోయి ప్రత్యర్థి పార్టీల మీద మాటల దాడిని చేయడం, లేదా వచ్చిన రెండు నెలల కాలంలోనే తాము అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పడం ముదావహం కాదు. కాబట్టి సభలో జగన్ భజన పక్కనపెట్టి ప్రజా సమస్యలపైన ప్రజా ప్రతినిధులు గట్టిగా మాట్లాడాలని, జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.