వైఎస్ జగన్ జన్మదినం అపురూపం: వెండినాణెం, రావిఆకు, కోడిగుడ్డు, రకరకాల పూలపై సీఎం రూపం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే జగన్ పై ఉన్న తమ అభిమానాన్ని వ్యక్తం చేయడానికి పోటీ పడుతున్నారు. విభిన్న రీతిలో అభిమానాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు వంటి ఈ సమాజానికి ఉపయోగపడే, సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.
వెండి నాణెం పై జగన్, విజయమ్మల చిత్రం
ఒక సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చాలామంది తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం కు చెందిన స్వర్ణకారుడు మైక్రో ఆర్టిస్ట్ అయిన ముగడ జగదీశ్వరరావు మూడు గ్రాముల వెండి పై జగన్ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన తల్లి వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా కొడుకును ఆలింగనం చేసుకున్న మధుర ఘటాన్ని వెండి నాణెంపై చెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కేవలం 60 నిమిషాల్లో దీనిని చెక్కినట్టుగా ఆయన పేర్కొన్నారు.
రావి ఆకుపై పెన్సిల్ షేడ్స్ తో జగన్ చిత్రం
ఇక కృష్ణా జిల్లాకు చెందిన ఓ చిత్రకారుడు పెన్సిల్ షేడ్స్ తో బియ్యం గింజలు, రాగులతో రావి ఆకుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రాన్ని రూపొందించారు. జగ్గయ్యపేట కు చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్ రూపొందించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. రంగురంగుల షేడ్స్ తో రావి రావి ఆకు మీద చిత్రీకరించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. చిత్రం రూపొందించిన వ్యక్తికి సీఎం జగన్ పై ఉన్న అభిమానం అర్ధం అయ్యేలా చెప్తుంది.
ఆకులో అందంగా జగన్ ఫోటో.. వైసీపీ నేత అభిమానం
ఇదిలా ఉంటే ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైయస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేమూరు నియోజకవర్గం నేత కారుమూరి వెంకట రెడ్డి ఆకుపై జగన్ ఫోటోలు చిత్రీకరింపజేశారు. జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు వినూత్నరీతిలో తెలియజేశారు. గత మూడేళ్లుగా ఆయన సీఎం జగన్ జన్మదినాన్ని విభిన్నంగా జరుపుతున్నారు.
2019 సంవత్సరంలో బాపట్ల బీచ్ లో జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2020లో తన పంట పొలంలో జై జగన్ అన్ని వచ్చేటట్టు వరి కోత యంత్రంతో కోత కోయించి డ్రోన్ ద్వారా చిత్రీకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తాజాగా ఆకుపై జగన్ ఫోటో ను చిత్రీకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
పూలతో జగన్ చిత్రం ... నర్సరీ యాజమాన్యం అభిమానం
ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఓ నర్సరీ యాజమాన్యం కూడా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తమకున్న అభిమానాన్ని ఆయన చిత్రాన్ని రూపొందించడం ద్వారా వినూత్నంగా తెలియజేసింది. తూర్పు గోదావరి జిల్లా కడియం లో పల్లా వెంకన్న నర్సరీ యాజమాన్యం సత్యనారాయణ మూర్తి, సుబ్రమణ్యం, గణపతి తదితరులు గులాబీలు, చామంతి పూలు, చిట్టి బంతి పూల ను ఉపయోగించి సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రాన్ని రూపొందింపజేసి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కోడిగుడ్లపై జగన్ తో పాటు సంక్షేమ పథకాలైన నవరత్నాలు
అంతేకాదు శ్రీకాకుళానికి చెందిన ఓ అభిమాని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు . అతను కోడిగుడ్ల పై జగన్ ఫోటో ను, నవరత్నాల పేరుతో జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను చిత్రీకరించి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్నూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక కోడిగుడ్డు పై జగన్ ఫోటోను చిత్రీకరించి జైల్లో ఉంచి చుట్టూ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల సంబంధించిన చిత్రాలను కోడిగుడ్ల పై తీర్చిదిద్ది తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఉన్న క్రేజ్ ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు చూపించే అభిమానం ద్వారా విభిన్న రీతులలో బహిర్గతమవుతూనే ఉంది.