వన్ టైమ్ సెటిల్మెంట్ స్వచ్చందమే-సీఎం జగన్ క్లారిటీ-దుష్ప్రచారంపై కఠిన చర్యలకు ఆదేశం
ఏపీలో సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) వివాదస్పదమవుతోంది. ఓవైపు వైసీపీ ప్రభుత్వం దీన్ని స్వచ్చందంగా అమలు చేస్తున్నట్లు చెబుతున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం లబ్దిదారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో విపక్షాలు దీన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీఎస్ పథకంపై జరుగుతన్న దుష్ప్రచారంపై ఇవాళ సీఎం జగన్ స్పందించారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటీఎస్ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు.

పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలనుకూడా చూపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉదయం సీఎం కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యంత్రి ఈ ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం స్వచ్చందంగా ముందుకొచ్చే వారికే ఈ పథకం అమలు చేస్తామని చెప్తుండగా.. క్షేత్రస్ధాయిలో మాత్రం అధికారుల తప్పిదాలతోనే ఇలాంటి ప్రచారం జరుగుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అధికారులకే సీఎం జగన్ ముందుగా హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా విపక్షాలను కూడా కట్టడి చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విపక్షాలు ఓటీఎస్ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఇవాళ ఆరోపించారు. ప్రజలు ఇలాంటి ప్రచారాన్ని నమ్మెద్దని సూచించారు. ఓటీఎస్ పథకాన్ని ప్రభుత్వం స్వచ్ఛందంగానే అమలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ చేసి ఇలాంటి ప్రచారాలతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందన్నారు. దీని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో ఎయిడెడ్ స్కూళ్ల విలీనం సందర్భంగా కూడా ప్రభుత్వానికి ఇలాంటి పరిస్ధితే ఎదురైంది విలీనం స్వచ్చంధమని ప్రభుత్వం ఎంతగా చెప్పినా క్షేత్రస్ధాయిలో చోటు చేసుకున్న పరిణామాలతో తల్లితండ్రులు రోడ్లపైకి వచ్చారు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్ధితిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది.












Click it and Unblock the Notifications