13 జిల్లా పరిషత్ ఛైర్మన్లు వీరే- ఎంపికలో జగన్ మార్క్ : ఎంపీపీలు- ఫాలో కావాల్సిందే ..!!
ఏపీలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఉప ఎన్నిక మినహా మరోసారి ఎన్నికలకు అవకాశం లేదు. పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ క్యాంపు జోష్ కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ప్రభుత్వం పైన వస్తున్న రాజకీయ విమర్శలు..ప్రజల్లో ఇమేజ్ తగ్గిందనే ప్రచారం నడుమ ఈ ఫలితాలు వారికి శక్తిని ఇచ్చాయి. సీఎం జగన్ సైతం ఈ ఫలితాలతో తమ పైన మరింత బాధ్యత పెరిగిందని స్పష్టం చేసారు. ఏకంగా ఏడు జిల్లాల్లో ఏకపక్షంగా జెడ్పీటీసీలు స్వీప్ చేయటం ద్వారా వైసీపీ బలం ఏ మాత్రం తగ్గలేదనే విషయం స్పష్టమైందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
13 జిల్లాల జెడ్పీ ఛైర్మన్లు రెడీ
ఎన్నికలు.. ఫలితాలు పూర్తి కావటంతో ఇక, జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎంపిక జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఈ నెల 24న మండల అధ్యక్షులు..ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తారు. ఆ తరువాత 25న జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. దీంతో..ఫలితాలు వస్తూనే 13 జిల్లాల్లో వైసీపీకి సంబంధించిన వారే జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా కొత్తగా కొలువు తీరటం ఖాయమైంది. దీంతో..పార్టీలో ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా ముందుగానే 13 జిల్లాలకు జెడ్పీ ఛైర్మన్లను సీఎం జగన్ ఎంపిక చేసారు.
సీఎం జగన్ మార్క్ ఎంపిక
ముందుగానే అక్కడి రిజర్వేషన్ల ఆధారంగా ఎవరికి జెడ్పీ పీఠం అప్పగించాల నే దాని పైన సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు..పార్టీ సమన్వయకర్తలకు ఇప్పటికే సీఎం దిశా నిర్దేశం చేసారు. ఎంపిక చేసుకున్న 13 మంది అభ్యర్దులు తాజా ఫలితాల్లో విజయం సాధించారు. దీంతో వారి ఎంపిక మరింత సులువుగా మారింది. శ్రీకాకుళం జిల్లా నుంచి కవిటి నుంచి గెలిచిన పిరియా విజయ పేరు ఖరారైంది. అదే విధంగా విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా మెరకముడిదాం నుంచి గెలిచిన మజ్జి శ్రీనివాస రావు పేరు ఖరారు చేసారు. విశాఖకు గూడెం కొత్త వీధి నుంచి గెలుపొందిన కీముడు శివరత్నం ఎంపిక దాదాపు పూర్తయింది. తూర్పు గోదావరి జెడ్పీ ఛైర్మన్ గా పి గన్నవరం నుంచి గెలిచిన విప్పర్తి వేణు గోపాల రావు బాధ్యతలు స్వీకరించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
అన్ని జిల్లాలకు సామాజిక సమీకరణాలతో
పశ్చిమ గోదావరి జెడ్పీ ఛైర్మన్ గా యలమంచిలి నుంచి గెలిచిన కవురు శ్రీనివాస పేరు ఖరారైంది. క్రిష్ణా జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గా గుడ్ల వల్లేరు నుంచి గెలుపొందిన ఉప్పాళ్ల హారిక పేరు ఖరారు చేసారు. గుంటూరు జిల్లా నుంచి కొల్లపర నుంచి గెలుపొందిన కత్తెర హెనీ క్రిస్టినా పేరు దాదాపు ఖరారు అయింది. ఇక, ప్రకాశం జిల్లా నుంచి దర్శి నుంచి గెలుపొందిన బూచేపల్లి వెంకాయమ్మ కొత్త జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఎన్నిక కానున్నారు. నెల్లూరు నుంచి నెల్లూరు రూరల్ నుంచి గెలిచిన ఆనం అరుణ పేరు ఎంపిక చేసారు.
వివాదాలకు అవకాశం లేకుండా ముందుగానే ఎంపిక
కర్నూలు జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా సంజామల నుంచి గెలిచిన మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి పేరుకు సీఎం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి ఆత్మకూరు నుంచి గెలుపొందిన గిరిజ పేరు ఖరారైంది,. అదే విధంగా సీఎం సొంత జిల్లా కడప నుంచి ఒంటిమిట్ట నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధరెడ్డి పేరుకు సీఎం ఆమోదముద్ర వేసారు. చిత్తూరు జిల్లా నుంచి వి కోట నుంచి గెలిచిన శ్రీనివాసులు పేరు దాదాపుగా ఖరారు చేసారు. వీరంతా 25 న జెడ్పీ ఛైర్మన్లుగా ఎన్నిక కావటం దాదాపు లాంఛనంగానే కనిపిస్తోంది.
Recommended Video
ఎంపీపీల విషయంలోనూ సీఎం దిశా నిర్దేశం
అదే విధంగా ఎంపీపీ ఎంపిక విషయంలోనూ పార్టీ పరంగా ఇప్పటికే మార్గదర్శకం చేసారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ..స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయనున్నారు. ఈ మొత్తం ఎన్నిక ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా జరగాలని నిర్దేశించారు. మున్సిపల్ ఛైర్మన్లు..మేయర్ల విషయంలో జరిగిన విధంగానే పార్టీ నిర్ణయం మేరకు ఎంపిక విధానం ఉండాలని సీఎం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.