డిసెంబర్ నుంచి ప్రజల్లోకి సీఎం జగన్ : ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలోనే ఉండాలి -సిటిజన్ అవుట్ రీచ్ ..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా పూర్తిగా జిల్లాల పర్యటనలకు దూరంగా ఉన్న జగన్.. డిసెంబర్ నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్పందన సమీక్షలో భాగంగా అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో వచ్చే ఎన్నికలకు సంసిద్దత గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..డిసెంబర్ నుంచి తాను ప్రజల్లోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చారు. హౌసింగ్ పధకాన్ని సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

హౌసింగ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి
హౌసింగ్ విషయంలో నెల రోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారమవుతాయని ఆశిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. పెండింగ్ కేసుల్లో 395 కేసులు తాత్కాలిక స్టేలు ఉన్నాయని చెప్పారు. వాటిపైన కూడా దృష్టిపెడితే.. పేదలకు మేలు జరుగుతుందని, లే అవుట్ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశామని అన్నారు.వారికి ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి డిసెంబర్లో పట్టాలు అందించాలన్నారు. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా
వన్ టైం సెటిల్మెంట్ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్లో చేయాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయ్యాయని, అక్టోబరు 25 నాటికల్లా బిలో బేస్మెంట్ లెవల్ ఇళ్లను బేస్మెంట్లెవల్పై స్థాయికి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేయాలన్నారు.

నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలి
సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, బీఎంసీయూలు, డిజిటల్ లైబ్రరీల పనులు చురుగ్గా సాగాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం ఇవ్వని బిల్లులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికంగా ఖర్చు చేశామని తెలిపారు. డిసెంబర్ 31 నాటికల్లా 4,530 పంచాయతీల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తోందని తెలిపారు. విలేజ్, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమైనవని, అలసత్వం వహించిన వారిపై చర్యలకూ వెనుకాడమని సీఎం జగన్ అన్నారు.

డిసెంబర్ నుంచి తాను రంగంలోకి
కలెక్టర్లు ప్రతివారం 2 సచివాలయాలు, జాయింట్ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను తప్పని సరిగా సందర్శించాలన్నారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని చెబుతామని సీఎం జగన్ అన్నారు. డిసెంబర్ నుంచి తాను కూడా సచివాలయాలను సందర్శిస్తూ ప్రతి పర్యటనలో సచివాలయాలను చూస్తానని తెలిపారు.

సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం
గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం, సెప్టెంబరు 24, 25 తేదీల్లో సిటిజన్ అవుట్రీజ్ కార్యక్రమం, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్ నంబర్లతో కూడిన పాంప్లెట్లనువారికి అందించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలని, జూన్, డిసెంబర్ నెలల్లో అన్ని అర్హులైన వారందరికీ కూడా పంపిణీ చేయాలన్నారు.
Recommended Video

వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగానే..
నిర్దేశించుకున్న రోజుల్లోగా అర్హులైన వారికి మంజూరు జరగాలని సీఎం జగన్ సూచించారు. కోవిడ్ తీవ్రత తగ్గిందని, ఉద్ధృతంగా ఉన్న కాలంలో పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉందని తెలిపారు. ప్రస్తుతం 2.5 శాతం కన్నా తక్కువగా ఉందని, రికవరీ రేటు కూడా 98.63శాతంగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్ పట్ల ఎలాంటి అలసత్వం వద్దని, 2 డోసుల వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయ్యేంతవరకూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దని సీఎం అధికారులకు సూచించారు. థర్డ్వేవ్ వస్తుందో, లేదో తెలియదని కానీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. టీచింగ్ ఆస్పత్రులు, ఆస్పత్రుల్లో కావాల్సిన పరికరాలను, మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.












Click it and Unblock the Notifications