నేరుగా సీఎం జగన్ - పబ్లిక్ పల్స్ తెలుసుకొనేలా : దిద్దుబాటుకు సిద్దం..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా సాధారణ ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీకి చెందిన నేతలు గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. అనేక సమస్యల పైన నేతలను ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిలదీస్తున్నారు. అయినా ప్రజల్లోనే ఉండాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు. రేపటి నుంచి వరుసగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశాలు ఖరారరయ్యాయి. ముందుగా కుప్పం నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతున్నారు.

సామాన్యులకు అందుబాటులో
ఇక, ఇదే సమయంలో తాను ప్రజలకు అందు బాటులో ఉండాలని సీఎం డిసైడ్ అయ్యారు. చాలా కాలంగా సామాన్య ప్రజలకు సీఎం అందుబాటులో ఉండేందుకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారని చెబుతూ వచ్చారు. కానీ, మూడేళ్లకు పైగా సమయం ముగిసిపోయింది. కరోనా కారణంగా సాధ్యపడలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు...తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలోనే నిత్యం ప్రజలను కలవాలని డిసైడ్ అయ్యారు. రేపటి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ, ఇప్పుడు మరోసారి ఇది వాయిదా పడింది. ఈ నెల 15న లేదా సెప్టెంబర్ 2 నుంచి సీఎం ప్రజాదర్బార్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో నిత్యం క్యాంపు కార్యాలయంలో ఉదయం సమయంలో ప్రజా దర్బార్ నిర్వహించే వారు.

పబ్లిక్ పల్స్ స్వయంగా తెలుసుకొనేలా
రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నేరుగా సీఎంను కలిసి తమ సమస్యలను చెప్పుకొనే వారు. వాటిని సీఎం కార్యాలయంలో ప్రత్యేక టీం పరిశీలించి..పరిష్కారం చూపించేవారు. దీంతో..నాడు వైఎస్సార్ వద్దకు వెళ్తే ఖచ్చితంగా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉండేది. ఇక, ఇప్పుడు జగన్ సైతం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఇదే విధంగా ప్రజా దర్భార్ నిర్వహిస్తారని భావించినా.. వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్తున్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వినిపిస్తున్న సమస్యల నేపథ్యంలో..తాను కూడా ప్రజలకు దగ్గర కావాలని సీఎం నిర్ణయించారు. దీని ద్వారా ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో..పబ్లిక్ పల్స్ తెలుసుకొని..దీనికి అనుగుణంగా పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

అవసరమైన దిద్దుబాటుకు సిద్దంగా
అదే సమయంలో సామాన్య ప్రజల సమస్యలతో ఎంతగా దగ్గరగా ఉంటే అంత మైలేజ్ దక్కుతుందని పార్టీ నేతలకు పదే పదే సీఎం సూచిస్తున్నారు. దీంతో..ఇప్పుడు సీఎం నుంచి పార్టీ నేతల వరకూ అందరూ ప్రజల్లోనే ఉండటం.. వాస్తవాలను తెలుసుకోవటం.. చేయాల్సిన మార్పులు - చేర్పులతో దిద్దుబాటు చర్యల ద్వారా ఎన్నికల నాటికి ప్రజల్లో సానుకూలత పెంచుకోవటమే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో..ముఖ్యమంత్రి కొత్తగా ప్రారంభిస్తున్న కార్యకర్తలతో సమావేశాలు.. ప్రజల కోసం ప్రజా దర్భార్ వైసీపీ ఓట్ బ్యాంక్ పెంచుకొనేందుకు ఏ మేర ఉపకరిస్తాయనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications