48 గంటల్లోగా పూర్తి చేయాల్సిందే - సవాల్ గా తీసుకోండి : సీఎం జగన్ ఆదేశం..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు. సీనియర్ అధికారులు, కలెక్టర్లు సహాయ కార్యక్రమాల బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పరిస్థితిపై.. ఆయా జిల్లాల ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధిత ప్రాంతాల్లో తక్షణ వరద సాయం, పంట నష్టం అంచనా, ప్రస్తుత పరిస్థితిని ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
48 గంటల్లోగా సాయం అందాలి
వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు సీఎంకు వివరించారు. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉందని సీఎం స్పష్టం చేసారు. సీనియర్ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉందని చెప్పారు.. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలని ఆదేశించారు. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలని నిర్దేశించారు. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి. కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్గా తీసుకోవాలని సీఎం స్పష్టం చేసారు.
ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర
అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కొందరు రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని.. జగన్ విమర్శించారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని.. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదని ఆయన గుర్తుచేశారు. జిల్లాల నుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి.. పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆదేశించారు.వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 48 గంటల్లో ఈసమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
వాలంటీర్లను వినియోగించుకోండి
అనేక పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారని.. వీటిని తిరిగి అప్పగించేటప్పుడు వాటిని పరిశుభ్రంగా అందించాలని సూచించారు. వరదల కారణంగా ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉందని.. ఆ బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.వరదలు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలని ఆదేశించారు. గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధవహించి.. వారిని ఆస్పత్రులకు తరలించాలని సీఎం ఆదేశించారు.