సీఎం జగన్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ : అనిల్ నివాసానికి మంత్రి కాకాణి - కలిసి పని చేస్తామంటూ..!!
నెల్లూరు నేతలకు సీఎం జగన్ మార్క్ ట్రీట్మెంట్ పని చేసింది. తాజా - మాజీ మంత్రులు ఇద్దరూ కలిసారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన కీలక భేటీకి ఒక్క రోజు ముందు నెల్లూరులో ఈ పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరులో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. నేతలు పరోక్ష వ్యాఖ్యలతో పార్టీలో కలకలానికి కారణమవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ పార్టీకి గట్టి పట్టు ఉన్న జిల్లాలో నేతల మధ్య విభేదాల పైన సీరియస్ అయ్యారు.
ఇద్దరు నేతలకు సీఎం జగన్ హితబోధతో
మంత్రిగా కాకాని బాధ్యతలు చేపట్టి..జిల్లాకు వస్తున్న సమయంలో మాజీ మంత్రి అనిల్ సభ ఏర్పాటు చేయటం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అదే విధంగా నెల్లూరు నగరంలో పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్న ప్లెక్సీలను తొలిగించటం కూడా వివాదాస్పదంగా మారింది. జిల్లా వైసీపీలో గ్రూపులుగా ఏర్పడటం పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు.
దీంతో..సీఎం క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా తాజా - మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి - అనిల్ కు పిలుపు అందింది. ఇద్దరితోనూ సీఎం జగన్ మాట్లాడారు. బయటకు వచ్చిన నేతలు అసలు తమ మధ్య విభేదాలు ఏంటంటూ ప్రశ్నించారు. ఈ రోజు మరోసారి సీఎం జగన్ పార్టీ జిల్లా అధ్యక్షులు...ప్రాంతీయ సమన్వయకర్తలు..అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసారు.
అనిల్ నివాసానికి కాకాణి..కలిసే ఉన్నామంటూ
దీనికి ముందే తాము కలిసే ఉన్నామని సంకేతాలు ఇచ్చేందుకు కాకాని - అనిల్ ప్రయత్నం చేసారు. అనిల్ నివాసానికి మంత్రి కాకాని వెళ్లారు. ఇద్దరూ దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. మంత్రి అయిన తరువాత తొలి సారి తన నివాసానికి వచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి అనిల్ స్వాగతం పలికారు. సత్కరించారు.
ఇక నుంచి జిల్లాలో డెవలప్ మెంట్ తో పాటుగా 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావటమే లక్ష్యంగా తాము పని చేస్తామని ఇద్దరు నేతలు ప్రకటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ నేతలను కలుస్తున్నానని..అందులో భాగంగానే అనిల్ నివాసానికి వచ్చానని కాకాణి చెప్పుకొచ్చారు. అయితే, ఇద్దరు నేతలు ఇప్పుడు కలుసుకోవటం ద్వారా పూర్తిగా కోల్డ్ వార్ కు ముగింపు పలికినట్లేనా..లేక, మనుషులు కలిసినా..మనసులు మాత్రం దూరంగానే ఉన్నాయా అనేది ఇప్పుడు నెల్లూరు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.
సీఎం నేడు కీలక భేటీ.. ముందురోజే ఆసక్తి కరంగా
రెండు రోజుల క్రితం వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీల తొలిగింపు వ్యవహారం పైన అనిల్ క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంలో ప్రతిపక్షాలతో పాటుగా సొంత పార్టీ నేతలు సైతం తన పైన గుర్రుగా ఉన్నారని... ఇక తాను ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోనంటూ అనిల్ తేల్చి చెప్పారు.
అయితే, నేతల మధ్య విభేదాలు...సమన్వయం..వంటి వ్యవహారాల పైన సీఎం జగన్ ఈ రోజు జరిగే సమావేశంలో స్పష్టత ఇవ్వటంతో పాటుగా హెచ్చరికలు సైతం జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
పలు జిల్లాల్లో ఇదే రకమైన పరిస్థితులు ఉండటం.. కొందరు సీనియర్ నేతలు సైతం మంత్రి పదవులు దక్కకపోవటంతో నైరాశ్యంతో వ్యవహరిస్తున్న తీరు పైన ముఖ్యమంత్రి తన వైఖరి స్పష్టం చేయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.