మంత్రులకు సీఎం జగన్ డెడ్ లైన్: రెండున్నారేళ్లు కాదు: ఆరు నెలలకే దిగిపోతారు..!
మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ టెన్షన్ పెంచే విషయం చెప్పారు. బాధ్యతలు అప్పగించే సమయంలో రెండున్నారేళ్ల తరువాత ఇప్పుడు ఉన్న మంత్రుల్లో అధిక శాతం మందిని మార్చి ఇప్పుడు అవకాశం రాని వారికి ప్రాధాన్యత ఇస్తామని జగన్ చెప్పారు.అయితే, ఇప్పుడు సీఎం కొత్త డెడ్ లైన్ విధించారు. రెండున్నారేళ్లు కాదు..ఆరు నెలల తరువాత సైతం దిగిపోవాల్సి రావచ్చంటూ తేల్చి చెప్పారు. కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా పూర్తయిన తరువాత రాజకీయ అంశాల పైన చర్చ సాగింది. ఆ సమయంలో మంత్రుల బాధ్యతలను సీఎం గుర్తు చేసారు.
ఇప్పటికే అయిదు నెలలు పూర్తవుతుందని.. ప్రభుత్వ .. పార్టీ కార్యక్రమాలు..పార్టీ బలోపేతం బాధ్యత మంత్రులే తీసుకోవాలని స్పష్టం చేసారు. కొంత మంది మంత్రులు ఇంకా జిల్లాలకు వెళ్లటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అటువంటి వారు ఆరు నెలల కాలంలోనే దిగిపోవాల్సి రావచ్చని పరోక్షంగా తన మనసులో మాట బయటపెట్టారు. దీంతో...మంత్రుల్లో అలజడి మొదలైంది.

మంత్రులకు కొత్త డెడ్ లైన్..
ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు కొత్త డెడలైన్ విధించారు. రెండున్నారేళ్లు పదవులో ఉంటామనే భావనలో ఎవరూ ఉండవద్దని.. సమర్ధత ఆధారంగానే భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేసారు. సమర్ధత నిరూపించుకోలేని వారు ఆరు నెలలకే దిగిపోవాల్సి రావచ్చని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి కేబినెట్ ఏర్పాటు సమయంలో ఇప్పుడు మంత్రులు అయిన వారు రెండున్నారేళ్ల కాలం ఉంటారని..ఆ తరువాత ఇప్పుడు అవకాశం రాని వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇప్పుడున్న 25 మందిలో అధిక శాతం మందిని తప్పిస్తామని చెప్పుకొచ్చారు.
అయితే, దాదాపు అయిదు నెలల పని తీరు పరిశీలించిన తరువాత ముఖ్యమంత్రి తాజాగా వారికి ఆరు నెలల సమయం మాత్రమే నిర్దేశించారు. సమర్ధత నిరూపించుకుంటే కొనసాగుతారని..లేకుంటే దిగిపోవాల్సి రావచ్చని పరోక్షంగానే తన ఆలోచన ఏంటనేది ముఖ్యమంత్రి స్పష్టంగా మంత్రులకు చెప్పేసారు.

సమన్వయం బాధ్యత మంత్రులదే..
జిల్లాల్లో ప్రభుత్వ పధకాల అమలు..పర్యవేక్షణ..పార్టీ బలోపేతం బాధ్యత మంత్రులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. మంత్రులు..ఎమ్మెల్యేలు..అధికారుల మధ్య సఖ్యత లేకుంటే అక్కడ మంత్రులే చొరవ తీసుకోవాలని సూచించారు. ఇన్ ఛార్జ్ మంత్రులుగా ఉన్న వారు వారానికి కనీసం రెండు రోజులు తమకు కేటాయించిన జిల్లాల్లోనే ఉండాలని సీఎం నిర్దేశించారు.
ఇప్పటికీ 99 శాతం మంది మంత్రులు జిల్లాలకు వెళ్లటం లేదని ఆగ్రహించారు. జిల్లాల్లో ప్రతీ నెలా ప్రభుత్వ..పార్టీ పరిస్థితుల పైన చర్చించి తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆరు నెలలకోసారి వారి పనితీరును సమీక్షిస్తానని సీఎం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో రాజకీయ కారణాలు చూపి నిష్పాక్షికంగా వ్యవహరించలేకపోతే మొత్తంగా ప్రభుత్వానికి..పార్టీకి నష్టం కలుగుతుందని..మంత్రులు దీనిని గుర్తించాలని సూచించారు. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా కాకుండా మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేసారు.

మంత్రులు ఎవరెక్కడ ఉంటున్నారు..
మంత్రులు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో స్పష్టత లోపించిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రుల కోసం వచ్చే ఎమ్మెల్యేలు..సందర్శకులు మంత్రులను కలవాలంటే ఏ విధంగా సాద్యం అవుతుందని సీఎం ప్రశ్నించారు. ఇక నుండి ప్రతీ మంగళ..బుధ వారాలు మంత్రులు ఖచ్చితంగా సచివాలయంలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.
తాను ఎంపిక చేసుకున్న మంత్రులు రాజకీయంగా.. పాలనా పరంగా సమర్ధంగా నడిపించగలరనే నమ్మకంతో తాను ఉంటే ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తారా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నాయని..వారి విషయంలో మంత్రులు స్పందించి..తగిన రీతిలో తిప్పి కొట్టాలని సూచించారు. జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేకు సమయం కేటాయించి..వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం సూచించారు. ఇక, ముఖ్యమంత్రి నిర్ధేశించిన కొత్త డెడ్ లైన్ ఇప్పుడు మంత్రుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.












Click it and Unblock the Notifications