మంత్రి మోపిదేవికి జగన్ మరో బంపరాఫర్ :వైసీపీకి త్వరలో రెండు ఎమ్మెల్సీలు..ఆ ఇద్దిరకే ఛాన్స్
ముఖ్యమంత్రి జగన్ మంత్రి మోపిదేవికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా పిలిచి మంత్రి పదవి ఇచ్చిన జగన్..తాజాగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అసెంబ్లీలో 151 సీట్లు గెలిచినా..మండలిలో మాత్రం టీడీపీ అధిక్యత లో ఉంది. ఎమ్మెల్యే కోటాలో తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీ సభ్యులుగా మండలిలో ప్రవేశించారు. మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. త్వరలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి.
స్థానిక సంస్థల కోటాలో అనంత, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం స్థానిక సంస్థల పాలక వర్గాలు లేవు కనుక ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఇక, ఇప్పుడు మంత్రి మోపిదేవికి చట్ట సభకు ఎన్నిక కావటంతో పాటుగా..ఆయనకు జగన్ ఇచ్చిన అవకాశం చర్చకు కారణమైంది. ముఖ్యమంత్రి మాత్రం తాను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా ఉన్న మోపిదేవికి మాత్రం కీలక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన రెండున్నారేళ్ల తరువాత కూడా మంత్రిగా కొనసాగటం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మోపిదేవి వైపే జగన్ మొగ్గు...
తాజాగా శాసనమండలి సభ్యులుగా వైసీపీకి చెందిన ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభలో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉండటంతో ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల నాని, టీడీపీకి చెందిన కరణం బలరాం తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన ఫలితంగా ఏర్పడిన ఖాళీలకు ఇటీవల విడివిడిగా ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్ ముగ్గురు సభ్యులను ఎంపిక చేసారు. టీడీపీ నుండి పోటీ లేకపోవటంతో వీరు నామినేషన్ వేసిన రోజే దాదాపుగా ఎన్నికయ్యారు. అయితే, నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తరువాత వీరు ఎన్నికైనట్లుగా ప్రకటన చేసారు. అయితే, కోలగట్ల రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి 29, 2021 వరకూ..ఆళ్ల నాని..కరణం బలరాం రాజీనామా చేసిన పదవీ కాలం 2023, మార్చి 29 వరకు గడువు ఉంది. అయితే, ముఖ్యమంత్రి ఇక్బాల్ కు ఏడాది పదవీ కాలాన్ని ఖరారు చేసారు. మిగిలిన ఇద్దరు మంత్రి మోపిదేవి వెంకటరమణ.. చల్లా రామకృష్ణారెడ్డికి మాత్రం మూడేళ్ల కాల పరిమతి కోటాలో నియమించారు. దీని ద్వారా శాసన మండలిలో ఇప్పటి వరకు ఆరుగురే వైసీపీ నుండి సభ్యులు ఉండగా..ఇప్పుడు తొమ్మదికి చేరింది.
మోపిదేవికి మంత్రి పదవి కంటిన్యూ..
మోపిదేవి వెంకట రమణకు మాత్రం జగన్ ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. సాధారనంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారి కంటే..సీటు ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారు. అయితే, ఎన్నికల్లో ఓడినా పిలిచి మోపిదేవి వెంకట రమణకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఆరు నెలల్లోగా చట్ట సభలకు ఎన్నిక కావాల్సి ఉండటంతో మోపిదేవికి తొలి విడతలోనే అవకాశం ఇచ్చారు. ఇక, మూడేళ్ల పాటు కాల పరిమితి తో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మోపిదేవి 2023 మార్చి 29 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. అయితే, జగన్ ఎన్నికల్లో గెలిచిన తరువాత తాను ఎంపిక చేసుకున్న క్యాబినెట్ లో ఛాన్స్ దక్కించుకున్న వారికి రెండున్నారేళ్ల కాల పరిమితి మాత్రమే ఉంటుందని..తరువాత కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. అయితే, మోపిదేవికి జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే ఖచ్చితంగా ఆయన రెండో దఫా లోనూ మంత్రిగా కొనసాగే అవకాశం స్పష్టమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ పైన కేసులు నమోదు..సీబీఐ విచారణ..జైలు శిక్ష సమయంలో మోపిదేవి సైతం వ్యాన్ పిక్ కేసులో జైలు శిక్ష అనుభ వించారు. దీంతో..జగన్ అధికారంలోకి రాగానే..ఎన్నికల్లో ఓడినా మంత్రి పదవి ఇచ్చారు. ఇక, కంటిన్యూ అవ్వటం సైతం ఖాయంగా కనిపిస్తోంది.
మరో ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం..
వైసీపీ నుండి గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం దక్కనుంది. తొలి విడత ఎమ్మెల్సీ పదవుల్లోనే తమకు వస్తాయని ఆశించిన ఇద్దరు నేతలకు జగన్ గవర్నర్ కోటాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. వచ్చే మార్చి 2 నాటికి ఏపీ శాసనమండలిలో మరో రెండు ఖాళీలు ఏర్పడతాయి. ఈ రెండు స్థానాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్ నియామకం చేస్తారు. అయితే, ఇప్పటికే శాసనమండలిలో స్థానిక సంస్థల కోటాలో అనంత, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం స్థానిక సంస్థల పాలక వర్గాలు లేవు కనుక ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ రెండు స్థానాలు టీడీపీలో ఎంపీగా ఉంటూ రాజీనామా చేసి ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరిన మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబుకు ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధ రెడ్డి తాజా ఎన్నికల సమయంలో జగన్ మాట కోసం రాజంపేట అసెంబ్లీ సీటు త్యాగం చేసి..టీడీపీ నుండి వచ్చిన మేడా మల్లి ఖార్జున రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో..గవర్నర్ కోటాలో రెండో స్థానం అమర్నాధరెడ్డికి దక్కనుంది.