వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ కీలక భేటీ - 2024 కి దిశా నిర్దేశం : మంత్రివర్గం పైనా..!!
ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోనే వచ్చే ఎన్నికలకు కార్యాచరణ సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా రేపు (11వ తేదీన) ప్రవేశ పెట్టే బడ్జెట్ ద్వారా నవరత్నాలకు మరింత ప్రాధాన్యతతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా రాజకీయంగానూ ఈ సమావేశాల్లోనూ ప్రభుత్వం మీద చేస్తున్న పలు అంశాలకు సంబంధించిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని భావిస్తున్నారు. సమావేశాల్లో భాగంగా ఈ రోజున సభలో మాజీ ముఖ్యమంత్రి...గవర్నర్ గా పని చేసిన కొణిజేటి రోశయ్యకు సభ సంతాపం ప్రకటించనుంది.

సభలో రోశయ్యకు సంతాపం
మరణించిన మాజీ శాసనసభ్యులకు సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. రోశయ్యకు సంతాపం ప్రకటించటం కూడా సీఎం కు ఇష్టం లేదనే విమర్శల నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, రేపు (11వ తేదీన) ఆర్దిక మంత్రి బుగ్గన 10.15 గంటలకు శాసనసభలో 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. దానికి ముందు కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనున్నార. ఇక, చాలా కాలంగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కావాలని భావిస్తున్నారు. కానీ, అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 15వ తేదీన అసెంబ్లీ సమావేశం ముగిసిన తరువాత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు .. ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు.

ఎమ్మెల్యేలతో సీఎం కీలక భేటీ
ఆ సమావేశం ద్వారా వచ్చే ఎన్నికలకు సంబంధించి రూట్ మ్యాప్ డిసైడ్ చేయనున్నారు. ఇక, నుంచి పార్టీకి సంబంధించిన ప్రతీ నేత ప్రజల్లోనే ఉండాలని సీఎం ఆదేశించే అవకాశం ఉంది. జూలై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహణకు ఇప్పటికే నిర్ణయం జరిగింది. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సీఎం జగన్ ఈ అంశం పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఈ రెండేళ్లలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పని తీర పైన ఇప్పటికే సీఎం జగన్ పూర్తి స్థాయిలో సమాచారం సేకరించారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల గురించి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది.

2024 ఎన్నికల కోసం రూట్ మ్యాప్
ఆ సమయంలోనే కొత్త మంత్రులతో కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతోంది. దీంతో..సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ సమావేశం ద్వారా సీఎం జగన్ దీని పైనా సంకేతాలు ఇస్తారని భావిస్తున్నారు. మొత్తం మంత్రులను మారుస్తారని చెబుతున్నా.. కొందరిని కంటిన్యూ చేసే అవకాశం ఉందంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో..సీఎం ఈ సమావేశంలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

కేబినెట్ విస్తరణ పైనా స్పష్టత
అదే విధంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏ పనులు చేయించలేకపోతున్నారనే భావన నుంచి బయట పడేందుకు వీలుగా ప్రతీ నియోజకవర్గానికి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది గతంలో అమలు చేసిన విధంగా ఎమ్మెల్యే నియంత్రణలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల ప్రకటనకు ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తంగా.. సీఎం జగన్ 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశం ద్వారా తన సైన్యాన్ని సిద్దం చేసేందుకు తొలి అడుగు వేస్తున్నారు. ఈ సమయంలో సీఎం చేయబోయే మార్గదర్శకం పైన ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications