వందేళ్ళ తర్వాత ఏపీలో సమగ్ర భూముల సర్వేకు శ్రీకారం: సీఎం జగన్ పుట్టినరోజు నాడే ముహూర్తం
వందేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర సర్వే కు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తక్కెళ్ళపాడు లో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా సమగ్ర రీ సర్వే ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం 'వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష' పేరుతో రూపొందించిన కార్యక్రమానికి సీఎం జగన్ నేడు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట లో దీనిని ప్రారంభించిన సీఎం జగన్ జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు లో ఇప్పటికే పూర్తి చేసిన సర్వే తీరును పరిశీలించి రైతులకు పట్టాలు అందజేయనున్నారు .ఈ రోజు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటం విశేషం.
తక్కెళ్ళపాడు, జగ్గయ్యపేటలలో భూముల రీ సర్వేకు శ్రీకారం
రాష్ట్రంలో 1920 - 27 మధ్యలో భూముల సర్వే జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్లీ సర్వే జరగలేదు . మధ్యలో సర్వే చేయాలని ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూధార్ పేరుతో సమగ్ర సర్వే కు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ నేటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తక్కెళ్ళపాడు, జగ్గయ్యపేటలలో ఈ కార్యక్రమం ప్రారంభానికి భారీగా ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ ముందుగా తక్కెళ్ళపాడు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుని అక్కడ రీ సర్వేను పరిశీలించి ఒక రైతు భూమికి సరిహద్దు రాళ్లను పాతుతారు అంతేకాదు రోవర్ పనితీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకుంటారు . ఆ తరువాత రోడ్డు మార్గంలో జగ్గయ్యపేట చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు పరిశీలిస్తారు.
జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన రెవెన్యూ , సర్వే , రిజిస్ట్రేషన్ శాఖల స్టాళ్ళ పరిశీలన
సర్వే ఆఫ్ ఇండియా, ఏపీ సర్వే శాఖ ,పంచాయతీరాజ్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాటుచేసిన స్టాళ్లను సీఎం జగన్ పరిశీలిస్తారు. గతంలో భూములను కొలవడానికి ఉపయోగించిన గొలుసుల దగ్గర నుండి, ప్రస్తుతం ఉపయోగిస్తున్న డ్రోన్ ల వరకు అన్నింటినీ ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ పద్ధతిలో కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ విధానంలో జిపిఎస్ అనుసంధానంతో భూముల రీ సర్వే చేయనున్నారు. దీంతో భూముల లెక్కలు పక్కాగా ఉంటాయని, కాస్త రిస్క్ అయినా సరే అన్ని భూముల లెక్క తేల్చేలా అధికారులు సమాయత్తమయ్యారు.
2023 నాటికి రాష్ట్రంలో పూర్తిగా భూముల సర్వే కంప్లీట్ చెయ్యాలనే లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యవసాయ వ్యవసాయ భూములను సర్వే చేసి కచ్చితత్వంతో కూడిన పట్టాలను రూపొందించి శాశ్వత భూ హక్కు కల్పిస్తారు. మూడేళ్ల తర్వాత వారికి పూర్తి హక్కులు లభిస్తాయి .ఈలోగా ఏవైనా తేడాలుంటే సివిల్ కోర్టు ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా వీలు కల్పిస్తున్నారు 2023 నాటికి రాష్ట్రంలో భూముల సర్వే మొత్తం పూర్తి కావాలని తర్వాత గ్రామ వార్డు సచివాలయం లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల రీ సర్వే కు సీఎం జగన్ నేటి నుండి శ్రీకారం చుట్టనున్నారు.
రంగంలోకి దిగనున్న 4,500 సర్వే టీమ్ లు
2021 జనవరి నుండి ప్రారంభించి 2023 జూన్ నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములను రీ సర్వే చేయడం కోసం 4,500 సర్వే టీమ్ లను సిద్ధం చేసింది సర్కార్ . ఇక సమగ్ర భూ సర్వే కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా సమాచారం. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం . దాదాపు 120 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ భూ సర్వే చేయబోతున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
70 బేస్ స్టేషన్ల ద్వారా, 15 వేల మంది సర్వేయర్లతో సర్వే ..డేటా అంతా అధికారికం
డ్రోన్ లు, రోవర్లు 70 బేస్ స్టేషన్ల ద్వారా నిర్వహించనున్న ఈ సర్వేలో మొత్తం పదిహేను వేల మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఒక్కో మండలంలో సర్వే నిర్వహణకు నాలుగు నెలలు పట్టనుంది. సర్వే సమయంలో వచ్చే భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సర్వే చేసిన ప్రతి భూమికి యూనిట్ నెంబర్ ఇవ్వడంతో ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా నమోదయి ఉంటాయి. ఎలాంటి భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది.