సీఎం జగన్ కీలక నిర్ణయం - అమ్మాయిలకు ప్రత్యేక కాలేజీ : ప్రతి మండలానికీ 2 జూనియర్ కళాశాలలు..!!
ఈ ఏడాది జూన్ లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలయ్యేలా సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది నుంచి 8వ తరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఆ దిశగా చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా శాఖపైన సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాడు - నేడు రెండో దశ వేగం పెరగాలని సీఎం సూచించారు. శరవేగంగా పనులు చేసి.. రెండో విడతను పూర్తిచేయాలన్నారు. రెండోదశ కింద దాదాపు 25వేల స్కూళ్లలో పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

గణనీయంగా మార్పులు కనిపించాలి
రెండోదశ నాడు-నేడు పనుల ద్వారా స్కూళ్లలో గణనీయంగా మార్పులు ఈ ఏడాది కనిపించాలని స్పష్టం చేసారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు-నేడు కింద పనులు చేపట్టాలని సీఎం స్పష్టం చేసారు. నాడు - నేడు ద్వారా చరిత్రలో ఈ ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. నాడు - నేడు రెండోదశ ఖర్చు అంచనా రూ. 11,267 కోట్లు గా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఇంగ్లిషు మాధ్యమంలోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. నాడు-నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు నిర్వహించటంతో పాటుగా.. ప్రతి మండలానికీ 2 జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

అమ్మాయిలకు ప్రత్యేక కాలేజీ
వీటిలో అమ్మాయిలకోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీనిపై కార్యాచరణ తయారుచేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. స్కూళ్లు తెరిచే నాటికి వారికి విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకుంటున్నామని..దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ పూర్తిచేశామని వివరించారు. విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

సీబీఎస్ఈ అఫిలియేషన్తో ఉండాలి
దశలవారీగా ఏర్పాటవుతున్న స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం కూడా చేపట్టాలని సీఎం ఆదేశించారు. జులై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం పూర్తికావాలన్నారు. ఇప్పటివరకూ 1310 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ చేయించామని అధికారులు వివరించారు. ప్రతి హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లన్నీ కూడా సీబీఎస్ఈ అఫిలియేషన్తో ఉండాలని..ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications