ప్లీనరీ వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన - మళ్లీ అధికారమే లక్ష్యంగా : రూట్ మ్యాప్ రెడీ..!!
ఏపీ రాజకీయాలు ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్నాయి. అధికార వైసీపీ - ప్రతిపక్ష టీడీపీ అధికారం దక్కించుకోవటమే టార్గెట్ గా అడుగులు వేస్తున్నాయి. మహానాడు ద్వారా తిరిగి అధికారం ఖాయమనే ధీమాలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. వైసీపీ ఆట ముగిసిందని..ఇక వార్ ఓన్ సైడ్..తమదే అధికారమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్ రంగంలోకి దిగారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూనే మంత్రుల బస్సు యాత్ర పైన సీఎం ఆరా తీసారు. ఇక, తాను ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు.

ఇక జనంలోకి సీఎం జగన్
అటు చంద్రబాబు నెలకు రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనకు సిద్దం అవుతున్నారు. లోకేష్ పాదయాత్ర దిశగా కసరత్తు చేస్తున్నారు. గ్రౌండ్ వాళ్లకు మాత్రమే వదలటానికి సిద్దంగా లేరు. పార్టీ ప్లీనరీ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించటానికి సిద్దమయ్యారు. రాజకీయంగా టీడీపీతో యుద్దానికి సై అంటున్నారు. ముందుగా ఆత్మకూరు బై పోల్ లో సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. అక్కడ గెలుపు కంటే మెజార్టీ ముఖ్యమనే విషయాన్ని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఆత్మకూరు బైపోల్ పైన నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ఇక, ఇదే సమయంలో జూలై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహణకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

ప్లీనరీ వేదికగా ఎన్నికల సమరశంఖం
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్లీనరీ నిర్వహణకు నిర్ణయించారు. 2017లో పార్టీ ప్లీనరీ నిర్వహించారు. అందులో తల్లి విజయమ్మ..సోదరి షర్మిలతో పాటుగా పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సైతం నాడు వైసీపీ అధినేతగా సీఎం జగన్ సభా వేదికగా పరిచయం చేసారు. తన పాదయాత్ర నిర్ణయాన్ని ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే చేయనున్న వాటి గురించి వివరించారు. ఇక, ఈ సారి తన తండ్రి జన్మదినం నాడు నిర్వహించే వేదికగా సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రావటం .. ఎన్నికల పైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికల పైన పెద్ద ఎత్తున అంచనాలు వ్యక్తం అవుతున్న సమయంలో దీని పైన స్పష్టత ఇస్తూనే.. రాజకీయ పొత్తులు - తన మూడేళ్ల పాలన - మిగిలిన కాలంలో తన ముందున్న లక్ష్యాలు - ప్రతిపక్షాలను కార్నర్ చేయటం - కేంద్రంతో సంబంధాలు ఇలా..అన్నింటిపైనా సీఎం జగన్ స్పష్టత ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్లీనరీ వేదిక నుంచే సీఎం జగన్ ఎన్నికల అంశంతో పాటుగా తాను జనంలోనే ఉండబోతున్న విషయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల రూట్ మ్యాప్ రెడీ - కీలక ప్రకటనలు
తన ప్రభుత్వం పైన..వ్యక్తిగతంగా తన పైన చేస్తున్న విమర్శలకు తానే సమాధానం చెబుతూ.. తన పాలన గురించి చెప్పుకుంటూ..ప్రజలతో మమేకం అయ్యేందుకు సీఎం జగన్ రచ్చబండ నిర్వహణకు నిర్ణయించారు. ప్లీనరీ ముగిసిన వెంటనే జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఏ సమయంలో అయినా ఎన్నికల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించే విధంగా జగన్ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. మహానాడు కంటే ధీటుగా.. అంతకు మించి అన్నట్లుగా పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..వచ్చే నెలలో జరిగే ఈ ప్లీనరీ వేదికగా సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలతో పాటుగా..ఎన్నికల మేనిఫెస్టోలో పెండింగ్ అంశాల పైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు..పార్టీ పరమైన నిర్ణయాల పైన సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications