సీఎం జగన్ తాజా నిర్ణయం - నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు: ఆ నేతలకు బాధ్యతలు..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు సామాజిక వర్గాల పరంగా ప్రాధాన్యత ఇస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా, ప్రాంతాల వారీగానూ అదే విధంగా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం మరింత మెరుగ్గా బిల్లును సభ ముందుకు తీసుకొస్తాం అని ప్రకటించింది. ఇదే సమయంలో ఆ బిల్లు పైన మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ముందుగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గతంలోనే ఆలోచనలు..ఇప్పుడు కార్యాచరణ
గతంలోనే దీని పైన ఆలోచన చేసినా.. మూడు రాజధానుల వ్యవహారం పైన చిక్కులు ఏర్పడటంతో వాటిని పక్కన పెట్టారు. ఇక, ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ విధానమని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. త్వరలోనే 13 జిల్లాల కోసం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు కానున్నాయి. అందులో భాగంగా.. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కోసం విశాఖ కేంద్రం ఒక మండలి ఏర్పాటు కానుంది. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాల కోసం రాజమండ్రి వేదికగా మరో మండలి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
నాలుగు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు
ఇక, గుంటూరు..ప్రకాశం..నెల్లూరు జిల్లాల ప్రాంతీయ అభివృద్ధి మండలి ఒంగోలు కేంద్రంగా ఖరారు చేస్తున్నట్లు సమాచారం. సీమ జిల్లాల కోసం కర్నూలు కేంద్రంగా మరో మండలి ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆ జిల్లాల్లోని అభివృద్ధి వ్యవహారాలు మొత్తం ఈ మండళ్ల ద్వారానే నిర్వహించే విధంగా మండలి పాలక వర్గాల రూప కల్పన జరుగుతోంది. అందులో స్థానికంగా ఉన్న సీనియర్ నేత కు ఛైర్మన్ హోదా కల్పించనున్నారు. కార్యదర్శిగా ఐఏఎస్ కు బాధ్యతలు కేటాయించాలని భావిస్తున్నారు.
రాజకీయల..అధికారులతో కలిపి
దీని ద్వారా అటు రాజకీయ..అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రాంతీయ మండళ్లు పని చేయనున్నాయి. వీటిలో సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉంటారు. ప్రధానంగా తమ ప్రాంతాల్లో ఉన్న వనరులు..అవకాశాల పైన ఈ బోర్డులు వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేసి తమ పరిధిలో పెట్టుబడుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్లనున్నాయి. అదే సమయంలో తమ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ సిద్దం చేసుకొని ఉద్యోగ..ఉపాధి అవకాశాల కల్పన తొలి లక్ష్యంగా చెబుతున్నారు.
మాజీలయ్యే మంత్రులకా.. సీనియర్ నేతలకా
ఇక, ఈ బోర్డులకు నిధుల కేటాయింపు ఏ విధంగా ఉండాలనే అంశం పైన కసరత్తు జరుగుతోన్నట్లుగా తెలుస్తోంది. ఏ జిల్లాను విస్మరించుకుండా అన్ని ప్రాంతాలకు ఏం చేయబోయేదీ...ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఇక, ఈ బోర్డు ఛైర్మన్లుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే రాజకీయ ఉత్సుకత మొదలైంది. కేబినెట్ విస్తరణ వార్తల నేపథ్యంలో మంత్రులుగా ప్రస్తుతం ఉన్న వారిని తొలిగిస్తే..వారిలో ఎవరికైనా ఈ బాధ్యతలు అప్పగిస్తారా.. లేక, పదవులు దక్కిని వారికి ప్రాధాన్యత ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే, సాధ్యమైనంత త్వరగా ఈ మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
అమరావతిలోనూ ప్రభావం కనిపించేలా
ఇందులో భాగంగా..అమరావతిలో సగంలో నిలిచిపోయిన భవనాలను సైతం పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందనే విమర్శలకు వీటి ద్వారా సమాధానం చెప్పాలని..ఇక, క్షేత్ర స్థాయిలో పనులను సైతం వేగవంతం చేసేందుకు ఆర్దికంగా వెసులుబాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరులోగానే ఈ ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు..వాటి విధి విధానాలు..బాధ్యతలను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.