నా ధైర్యం -నమ్మకం అదే : నాడు బాగుపడింది ఆ నలుగురే - సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ తన నమ్మకం - ధైర్యం ఒక్కటేనని.. దేవుడి ఆశీర్వాదం .. ప్రజల అభిమానం మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు. బాపట్లలో ముఖ్యమంత్రి 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను విడుదల చేసారు. తాను పేదలకు మేలు చేసే లక్ష్యంతో పని చేస్తుంటే..పథకాల పైన కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
అవహేళన చేస్తున్నారంటూ
పథకాల పేరుతో నగదు పంపిణీ చేస్తున్నారంటూ అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను టీడీపీ కు ఉన్నట్లుగా మీడియా మద్దతు లేదని.. దత్త పుత్రుడు సపోర్ట్ లేదని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో డీబీపీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ అమలు చేస్తుంటే.. గత ప్రభుత్వ హయాంలో డీపీటీ దోచుకో - పంచుకో- తినుకో పథకం అమలు చేశారని ఎద్దేవా చేసారు. గత ప్రభుత్వానికి ..ఈ పాలనకు తేడా గమనించాలని సూచించారు. పేద విద్యార్ధుల చదువే మనకు భవిష్యత్ ఆస్తిగా పేర్కొన్నారు. గత పాలనలో రాష్ట్రంలో నలుగురే బాగుపడ్డారంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.
వారికి కడుపుమంట
ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపుమంటతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా అందించామని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఈ ప్రభుత్వంలో చెల్లించామని చెప్పుకొచ్చారు. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. అమ్మఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజ్యూస్తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చు చేసామని ముఖ్యమంత్రి వివరించారు.
ప్రతీ విద్యార్ధికి అండగా నిలుస్తాం
హయ్యర్ ఎడ్యుకేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ప్రతీ విద్యార్దికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నామని సీఎం వివరించారు. బాపట్లలో మెడికల్ కాలేజీతో పాటుగా ఇతర సదుపాయాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కోన రఘపతి అభ్యర్ధనలకు ముఖ్యమంత్రి అంగీకారం ప్రకటించారు.