అవినీతి , వివక్ష లేకుండా పని చెయ్యండి .. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ దిశా నిర్దేశం
ఇటీవల జరిగిన మునిసిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ లు , డిప్యూటీ మేయర్ లు, చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్ లు, చైర్మన్ ల వర్క్ షాప్ కు హాజరైన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వారందరికీ అభినందనలు తెలియజేయడమే కాకుండా, బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు.

మున్సిపాలిటీలలో మహిళలకు పెద్ద పీట వేశామన్న జగన్
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులు కేటాయించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక మున్సిపల్ పదవుల్లోనూ మహిళలకు పెద్దపీట వేశామన్నారు.
దేవుడి దయతో, ప్రజల దీవెనలతో విజయం సాధించామని పేర్కొన్న జగన్ ప్రజలు ఎంతో విశ్వాసంతో మనపై ఉంచిన బాధ్యతను గుర్తించి పనిచేయాలని, ప్రస్తుతం మన పై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. అవినీతి, వివక్ష ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి గట్టిగా చెప్పారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఏపీ ముఖ్యమంత్రి
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 78 శాతం పదవులు ఇచ్చామని, మొత్తం 67 పదవులు ఇక మున్సిపాలిటీలలో మహిళలకు 52 పదవులను ఇచ్చామని పేర్కొన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, అభివృద్ధి పథంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లను నడిపించాలని ఆయన కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణకు 8వేల వాహనాలను కేటాయించామని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి కాలనీలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, చెత్తరహిత కాలనీలుగా మార్చాలని సూచించారు.

ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలి
ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వాటిపై కూడా దృష్టి సారించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు . మధ్యతరగతి వారికి తక్కువ ధరకు ఇళ్లస్థలాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇరవై రెండు నెలల పాలన లో లక్ష కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించామని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చెయ్యాలన్న జగన్
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పని చెయ్యాలన్నారు . వివక్ష అన్న మాటే వినపడకూడదని సీఎం జగన్ పేర్కొన్నారు . నాడు - నేడు ద్వారా పాఠశాలలో రూపురేఖలు మార్చాలని ఆయన స్పష్టం చేశారు. రైతులకు మేలు చేయడం కోసం ఆర్బీకే లు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు .
అర్హులకు కచ్చితంగా పథకాలు అందాలని సీఎం జగన్ సూచించారు .












Click it and Unblock the Notifications