ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ .. ఆ సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా !!
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా ప్రధాని మోడీతో భేటీ ముగిసింది . జగన్ ఢిల్లీ టూర్ తాజా ఏపీ పరిస్థితుల నేపధ్యంలో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. గత నెల 22, 23 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ రెండు వారాలు తిరగక ముందే ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కేంద్రంలోని ఎన్డీయేతో కలిసి సాగేందుకు అని కొందరు భావిస్తే , గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ కోసం మరికొంత మంది చర్చించారు. కానీ ఈరోజు 10 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోడీతో సమావేశం అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానితో రాష్ట్రాభివృద్ధి అజెండాగా మాత్రమే పలు అంశాలను చర్చించినట్టు తెలుస్తుంది .
మౌనం వీడి మా నీటి లెక్క తేల్చండి.. ఏపీ తీరుపై నిప్పుల వర్షం .. కేంద్రానికి సీఎం కేసీఆర్ ఘాటు లేఖ
ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలు , నిధులపై చర్చ
ఏపీ సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాల్సిందిగా కోరినట్టు తెలుస్తుంది . ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం పెండింగ్ నిధులు, ఇతర పెండింగ్ బకాయిలను విడుదల చేసి రాష్ట్రానికి సహకారం అందించాలని కోరినట్టు తెలుస్తుంది. దాదాపు 45 నిముషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితిని , విభజన తర్వాత ఏపీకి నెరవేరని పలు హామీలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు సీఎం జగన్ .
ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా సాగిన భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, విభజన హామీలతో పాటుగా 17 అంశాలపై ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివేదించినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ రోజే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మధ్యాహ్నం అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది .ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 12వ తేదీన ప్రధాని మోడీ ని కలిశారు . కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా మాట్లాడటం తప్ప రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకంగా కలిసి చర్చించిన సందర్భం లేదు.
8నెలల తర్వాత మోడీతో ప్రత్యక్ష భేటీ అయిన సీఎం జగన్
ఇక నేడు దాదాపు ఎనిమిది నెలల తర్వాత జగన్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఇక గతంలో సెప్టెంబర్ 22వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో 23వ తేదీన జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో కలిసి రాష్ట్రంలోని వివిధ అంశాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కేంద్ర పరిధిలో ఏపీకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట ప్రధానిని కలిసిన వారిలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.