పదవుల పంపకాలపై సీఎం జగన్: వారికే ప్రాధాన్యత - గవర్నర్ సమక్షంలో..!!
రాజ్యాంగంలో చెప్పిన గ్రామస్వరాజ్యాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న తొలి ప్రభుత్వం మనదేనని వివరించారు. ఇప్పటి వరకు ఈ మూడున్నారేళ్ల కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ కింద ప్రజలకు అందించిన మొత్తం రూ.1,76,517 కోట్లుగా సీఎం జగన్ వెల్లడించారు. అదే సమయంలో తమ ప్రభుత్వ సామాజిక న్యాయం అమలు చేస్తున్న విధానాన్ని సీఎం వివరించారు. మంత్రివర్గం నుంచి క్షేత్ర స్థాయి వరకు ఏ వర్గాలకు ఏ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చిందీ చెప్పుకొచ్చారు. గవర్నర్ సమక్షంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం - సామాజిక న్యాయం గురించి ముఖ్యమంత్రి వివరించారు.

తొలి ప్రభుత్వంగా గుర్తింపు
రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించారు. రాజ్యాంగం ప్రజాయుధంగా సీఎం పేర్కొన్నారు. విజయవాడ నడుమ 2023 ఏప్రిల్లోనే అంబేడ్కర్గారి మహా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో పేదలకు ఇంగ్లిష్ మీడియం మొదలు, బైలింగ్వల్ టెక్ట్స్బుక్స్, డిజిటల్ క్లాస్ రూమ్ల వరకు విద్యారంగంలో సంస్కరణల ద్వారా అందిస్తున్నామని వివరించారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటిది తమ ప్రభుత్వమేనని వెల్లడించారు. మహిళా సాధికారతకు అర్థం చెబుతూ.. జగనన్న అమ్మ ఒడి, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ సున్నావడ్డీ, 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ వంటి వాటిని సీఎం వివరించారు.

35 నెలల కాలంలో 1.76 లక్షల కోట్ల పంపిణీ
ఈ 35 నెలల పాలనలో ఒక్క డీబీటీ ద్వారానే లంచాలు, వివక్షకు తావులేకుండా నేరుగా ప్రజలకు అందించిన మొత్తం ఇప్పటి వరకు రూ.1,76,517 కోట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అందించిన మొత్తం రూ.3,18,037 కోట్లు ఇచ్చినట్లు ప్రకటించారు. మంత్రిమండలిలో 75 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాలే ఉన్నారని వివరించారు. రెండు మంత్రివర్గాల్లోనూ 5గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. అందులో నలుగురు (80శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. శాసనసభ స్పీకర్గా బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి, మండలి చైర్మన్గా ఎస్సీని నియమించడమే కాకుండా.. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా మైనార్టీకి చెందిన మహిళను కూర్చోబెట్టామన్నారు. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయంగా అభివర్ణించారు.

ఆ వార్గాలకు అన్నింటా ప్రాధాన్యం
ఈ మూడు సంవత్సరాల్లో రాజ్యసభకు 8మందిని పంపితే.. అందులో నలుగురు బీసీలే. శాసనమండలికి అధికార పార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారేనని ముఖ్యమంత్రి వివరించారు. ఇక, 13 జిల్లాల పరిషత్ చైర్మన్ పదవుల్లో 9 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించిన ప్రభుత్వంగా చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లలో 86 శాతం, మున్సిపాలిటీల్లో 69 శాతం, మండల ప్రజాపరిషత్ చైర్మన్లలో 67 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాలకే కేటాయించినట్లు వివరించారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను నియమించామని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications