YS Jagan : మనసు కలచివేసింది- రిపీట్ కానివ్వను-సీతానగరం గ్యాంగ్రేప్పై జగన్
గుంటూరు జిల్లా సీతానగరం వద్ద ఆదివారం చోటు చేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఇప్పటికే విపక్షాలు తన ఇంటికి సమీపంలో జరిగిన దారుణ ఘటనపై సీఎం స్పందించడం లేదని విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ సీతానగరం ఘటనను ఖండించారు. ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన సీఎం జగన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఘటన నా మనసును కలిచి వేసిందని సీఎం జగన్ అన్నారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. తనను ఇ ఘటన కలిచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవాంఛనీయ ఘటన జరిగిపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి చాలా చింతిస్తున్నానన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకూడదన్నారు. మహిళలు అర్ధరాత్రి పూట తిరగగలిగే పరిస్ధితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని గట్టిగా నమ్మిన వ్యక్తిని తాను అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ప్రకాశం బ్యారేజ్ తరహా ఘటనలు జరగకుండా మీ అన్నగా, తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని సీఎం జగన్ మహిళలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే సీతానగరం గ్యాంగ్ రేప్ ఘటనపై పూర్తి వివరాలు తెప్పించుకున్న జగన్... హోంమంత్రి, మహిళా కమిషన్ అధ్యక్షురాలిని, ఇతర నేతల్ని గుంటూరు జీజీహెచ్లో బాధితురాలి పరామర్శకు పంపారు. ఈ కేసులో పోలీసులు కూడా పురోగతి సాధించారు. ఇవాళ ఉదయం ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితుల ఫొటోల్ని విడుదల చేశారు. మిగిలిన ఆధారాల కోసం వేట కొనసాగుతోంది.