ఆ నిర్ణయాలపై సీఎం జగన్ సీరియస్ - వెంటనే రద్దు చేయండి..!!
CM Jagan Serious: ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. అధికారుల నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలిగిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీని పైన సీఎంఓ ఆరా తీసింది. ఒక ప్రభుత్వ విభాగంలొ కొంత మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బందిని తొలిగించటం పైన సీరియస్ అయిన ముఖ్యమంత్రి వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరినీ తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.

టీడీపీ పెద్ద తలలు చిక్కుతాయి
తాజాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పైన ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. 26 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు విచారణ ప్రారంభమైంది. దీని పైన స్పందించిన సజ్జల స్కిల్ డెవలప్మెంట్ అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్లో రాజకీయ ప్రమేయం ఉందని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. ఇది పక్కా ప్రణాళిక మేరకు జరిగిన స్కాంగా కనిపిస్తోందన్నారు. తెర వెనుక పెద్దల పాత్ర లేకుండా ఈ స్థాయిలో స్కాం చేయలేరని అభిప్రాయపడ్డారు. వాస్తవాలేంటనేది ఈడీ విచారణలో బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు.

పోలవరం జగన్ పూర్తి చేస్తారు
రాయలసీమకు వైఎస్ ఆర్ సహా జగన్ ఏం చేశారనే విషయం అక్కడి ప్రజలకు తెలుసని సజ్జల పేర్కొన్నారు. ఎడారి లాంటి పులివెందులలో నీరు నింపి బోటింగ్ కూడా సీఎం ప్రారంభించారన్నారు. రాయలసీమకు శ్రీశైలం నుంచి వరద జలాలు ఇవ్వాలని కాలువల వెడల్పు చేపట్టారన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు లిఫ్ట్ చేసేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని వివరించారు. పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు ౩ టీఎంసీలు లిఫ్టింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఎన్జీటీలో కేసు వేసి చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. హంద్రీనీవా, వెలిగొండ పనులను సీఎం జగన్ పూర్తి చేస్తున్నారన్నారు. కుప్పం బ్రాంచి కెనాల్ ను కూడా చంద్రబాబు పూర్తి చేయకపోతే వైఎస్ జగన్ పూర్తి చేశారని వివరించారు. రాయలసీమకు అయిదు మెడికల్ కాలేజీలు వస్తున్నాయని చెప్పారు. దేశంలోనే తొలి సారిగా చిన్న పిల్లల కార్డియాక్ ఆస్పత్రి తిరుపతిలో ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.

పకడ్బంధీగా మూడు రాజధానుల బిల్లు
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారకుడుగా సజ్జల పపేర్కొన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు ...పోలవరం పూర్తి చేసేది లేదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ హయాంలోనే పోలవరం పూర్తవుతుందన్నారు. ఇప్పటికి రాజధాని, హైకోర్టు అమరావతి లోనే ఉన్నాయని..కర్నూలు లో హైకోర్టు పెట్టాలన్నది తమ విధానంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మూడు రాజధానులు రావడం ఖాయమని సజ్జల స్పష్టం చేసారు. న్యాయ పరిశీలన చేసి పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లు శాసన సభలో పెడతామని సజ్జల వెల్లడించారు. మూడు రాజధానుల విషయంలో తమ నిర్ణయం స్పష్టంగా ఉందని.. విశాఖ నుంచి పాలన ఖాయమని సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications