ఎన్నికల్లో జగన్ తొలి విజయం - అసలు ఆట మొదలు..!!
ఏపీలో తిరిగి అధికారం నిలబెట్టుకోవటం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎలాగైనా అధికారం దక్కించుకోవటం చంద్రబాబుకు సవాల్ గా నిలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. జగన్ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమదే విజయం అంటూ కూటమి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో జగన్ ప్రచార సమయంలో తొలి విజయం సాధించారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టారు.
జగన్ పక్కా ప్లాన్
ఈ ఎన్నికలు జగన్ - చంద్రబాబు ఇద్దరి సమర్ధతకు పరీక్షగా మారాయి. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు రెండు పార్టీలతో జత కట్టారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు, చంద్రబాబు, పవన్ ప్రచారం చేస్తున్నారు. జగన్ తాను తొలి నుంచి సింగిల్ గా పోటీ చేసినా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. తాను అమలు చేసిన సంక్షేమం తనను గెలిపిస్తుందనే నమ్మకం. ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెద్దగా కొత్త హామీలు ఇవ్వలేదు.

అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ విషయంలో కొంత మేర పెంపుదల ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ తో పాటుగా 50 ఏళ్లకే పెన్షన్ తో సహా మరిన్ని ఆకర్షణీయ పథకాలను ప్రకటించారు. పవన్ సూచించిన షణ్ముక పథకాలను అందులో చేర్చారు. ఇందులో బీజేపీకి ప్రమేయం లేదు.
విశ్వసనీయత అస్త్రం
అయితే, జగన్ తొలి నుంచి హామీల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను అయిదేళ్ల కాలంలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చిన విషయాన్నిబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదే సమయంలో చంద్రబాబు ఇదే కూటమి నేతలతో కలిసి 2014 లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని అంశాలను ప్రతీ సందర్భంలో వివరిస్తున్నారు.
దీని కారణంగానే చంద్రబాబు, పవన్ ప్రకటించిన మేనిఫెస్టోతో బీజేపీ సంబందం లేనట్లుగా వ్యవహరించింది. ఆచరణ సాధ్యం కాని హామీలుగా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేసారు. దీనిని జగన్ అందిపుచ్చుకున్నారు. చంద్రబాబు హామీలను బీజేపీ నేతలే నమ్మటం లేదని..సాధారణ ప్రజలను మోసం చేసేందుకే సాధ్యం కాని హామీలను ప్రకటించారని ప్రజల్లోకి తీసుకెళ్లారు. చంద్రబాబు చెప్పిన సంపద గురించి లెక్కలతో విశ్లేషించారు.

ఆత్మరక్షణలోకి నెట్టేలా
దీంతో..చంద్రబాబు సహా కూటమి నేతలు తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎన్నికల ప్రచార సభల్లో పెద్దగా ప్రస్తావన చేయటం లేదు. అటు జగన్ తాను తిరిగి అధికారంలోకి వస్తేనే పథకాల కొనసాగింపు.. తాను గెలవకుంటే పథకాల ముగింపు అని బలంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ పూర్తిగా తమ ప్రచార సభల్లో జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.
టీడీపీ నేతలు తమ సంక్షేమ మేనిఫెస్టోను ప్రజల్లో తీసుకెళ్లటం లో విఫలమయ్యారు. జగన్ ప్రయోగించిన విశ్వసనీయత అస్త్రం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. చంద్రబాబు చెప్పినా అమలు చేయరంటూ జగన్ ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో..చివరి మూడు రోజులు మరింతగా విశ్వసనీయత..పథకాల అమలు..సామాజిక సమీకరణాలను వివరిస్తూ జగన్ పూర్తిగా కూటమి పైన ఎటాకింగ్ కు సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications