పాఠశాలల సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ - అన్ని స్కూళ్లల్లో ఇంటర్నెట్ : సీఎం జగన్..!!
పాఠశాలలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేయటానికి వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. విద్యా శాఖ పైన సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా పాఠశాలల్లో జరుగుతున్న నాడు - నేడు పనుల పైన సమీక్షించారు. స్కూళ్ల నిర్వహణ పైన పేరెంట్స్ కమిటీలను చైతన్యం చేయాలని సూచించారు. తరగతి గదుల డిజిటలైజేషన్ లో భాగంగా .. అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
అదే విధంగా అన్ని పాఠశాలలలో స్మార్ట్ టీవీలు..ఇంటరాక్ట్ టీవీలను ఏర్పాటు చేయాలన్నారు. 5.18 లక్షల టాబ్ లను కొనుగోలు చేయాలని..వాటిలో బైజూస్ కంటెంట్ తో విద్యార్ధులకు అందించాలని సమీక్షలో నిర్ణయించారు.
తరగతుల డిజిటలైజేషన్ కోసం దాదాపు రూ 512 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. పాఠశాలల నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే ప్రభుత్వానికి చెప్పేందుకు 14477 నెంబర్ తో టోల్ ఫ్రీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే జూన్ నాటికి అందించేందుకు వీలుగా ముందుగానే విద్యా కానుక కోసం ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
నాడు - నేడు నిర్వహించిన పాఠశాలల్లో ప్రతీ నెలా ఆడిట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ఇక నుంచి పాఠశాలల నిర్వహణలోనూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాలంటీర్లు భాగస్వాములు కానున్నారు. మండల స్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారులకు ఒకరికి పాఠశాలల నిర్వహణ..మరొకరికి అకడమిక్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. తరగతి గదుల డిజిటలైజేషన్ కోసం 72, 481 యూనిట్ల ఇంటరాక్ట్ టీవీలు అవసరమని గుర్తించారు. వీటిని ప్రభుత్వం దశల వారీగా ఏర్పాటు చేయనుంది.