ఢిల్లీ వేదికగా సీఎం జగన్ - చంద్రబాబు : ప్రధాని సమక్షంలో - అక్కడే క్లారిటీ..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే వేదిక మీదకు రానున్నారు. ఇందుకు ఢిల్లీ వేదికగా మారనుంది. డిసెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల అధినేతలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం రావటంతో ఆయన పర్యటన ఖరారైంది. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా ప్రధాని సమక్షంలో ఈ ఇద్దరు నేతల హాజరు పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.

ఢిల్లీ వేదికగా మరోసారి సీఎం జగన్ - చంద్రబాబు
తాజాగా జీ20 కూటమి నాయకత్వ బాధ్యతలు భారత్ చేతికి అందాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఏడాది పాటు భారత్ జీ20 దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వచ్చే నెల 5వ తేదీన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఈ ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో 32 రంగాలపై కేంద్రం 200కి పైగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది భారత్ లో నిర్వహించే జీ20 సమావేశ ఎజెండా కోసం అఖిలపక్ష భేటీలో అభిప్రాయాలు తీసుకోనుంది. కూటమికి నాయకత్వం వహించాల్సిన భారత్ తీసుకోవాల్సిన బాధ్యత పైన చర్చించి.. పార్టీల అధినేతల నుంచి సలహాలు స్వీకరించే క్రమంలో భాగంగా ఆ సమావేశం ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించి నేరుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అన్ని పార్టీల అధినేతలోనూ మాట్లాడుతున్నారు.

ప్రధానితో సమావేశానికి చంద్రబాబు ప్రయత్నం
ఆ క్రమంలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. ఆయన పర్యటన దాదాపు ఖరారైంది. డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే సమయంలో లోక్ సభలో నాలుగో పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ అధినేత సీఎం జగన్ కు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. గతంలో ఇదే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' సమావేశంలో కేంద్ర ఆహ్వానం మేరకు చంద్రబాబు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సీఎం జగన్ ను కేంద్రం ఆహ్వానించింది. సీఎం జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే రోజు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినా.. చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమానికి హాజరు కాలేదు. మరుసటి రోజున జరిగిన ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇక, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ - చంద్రబాబు మధ్య చాలాకాలం తరువాత పలకరింపులు చోటు చేసుకున్నాయి. ఇక, ఇప్పుడు మరోసారి కలిసేందుకు చంద్రబాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది.

జగన్ హాజరవుతారా - ఏం జరుగుతోంది
ఇక, ఇప్పుడు మరోసారి కలిసేందుకు చంద్రబాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధాని అందుకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే, తాజాగా ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. అప్పటి వరకు పవన్ - టీడీపీ మధ్య పొత్తు ఖాయమంటూ జరిగిన ప్రచారం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ టీడీపీకి దూరమవుతున్నారనే సంకేతాలు రాజకీయంగా మొదలయ్యాయి. అటు చంద్రబాబు 2014 ఎన్నికల పొత్తు రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు ఛాన్స్ లేదని తేల్చి చెబుతున్నారు. పవన్ తన నిర్ణయం ఏంటనేది మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వటం లేదు. విశాఖ వేదికగా ప్రధానితో తమ సంబంధాలు ప్రత్యేకమని..రాజకీయాలకు అతీతమని సీఎం జగన్ స్పష్టం చేసారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా చంద్రబాబు కొత్త రాజకీయ వ్యూహాల అమలుకు అడుగులు వేయటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..సీఎం జగన్ ఎటువంటి కౌంటర్ ప్లాన్ అమలు చేస్తారనేది ఆసక్తి కరంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications