CM Jagan Delhi Tour:కేంద్ర మంత్రులతో వరుస భేటీలు : రఘురామ ఎపిసోడ్ కు ముగింపు ఇస్తారా..!!
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా వాయిదా పడింది. ముఖ్యమంత్రి పర్యటన పైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు..సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది. అధికారిక అజెండాతో పాటుగా పొలిటికల్ అంశాలు ఈ సారి కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సమస్య పైన సీఎం జగన్ ప్రధానికి లేఖలు రాసారు. అదే విధంగా అందరు ముఖ్యమంత్రులు ఒకే వాయిస్ వినిపించాలని..కేంద్రమే బాధ్యత తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీని పైన ప్రధాని ఇప్పటికే స్పష్టత ఇచ్చేసారు. దీంతో..ఇక, పోలవరం నిధుల విషయంలో ప్రధాని...కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినా ఇప్పటికీ నిధుల విషయంలో స్పష్టత రాలేదు. అదే విధంగా కరోనా కారణంగా ఏపీ ఏ మేర నష్టపోయిందీ వివరించేందుకు వరుసగా జలశక్తి మంత్రి షెకావత్ తో పాటుగా ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ జగన్ భేటీ కానున్నట్లు సమాచారం.

కేంద్రమంత్రుల వద్ద రఘురామ టాపిక్
ఇక, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తోనూ జగన్ అప్పాయింట్ మెంట్ కోరారు. ఆయనతో సమావేశం లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రఘురామ రాజు వ్యవహారంలో ఆయన ప్రభుత్వం పైనా ..ఆర్మీ ఆస్పత్రిలో మేనేజ్ చేయటానికి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వచ్చారని.. జగన్ ప్రభుత్వం తనను హింసించిందని ఫిర్యాదు చేసారు. ఈ అంశం పైన జగన్ నేరుగా రాజ్ నాధ్ కు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘురామ రాజు ను సీఐడి విచారించిన సమయంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని..వాటిని సైతం కేంద్ర మంత్రులకు జగన్ వివరించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జరిగే భేటీ కీలకంగా మారనుంది. ఇప్పటికే రఘురామ రాజు ఢిల్లీ కేంద్రంగా పలువురు కేంద్ర మంత్రులు..ఎంపీలు..రాష్ట్రాల ముఖ్యమంత్రులు..గవర్నర్లకు లేఖలు రాసారు.

అమిత్ షాకు వివరణ
జగన్ ప్రభుత్వం తనను హింసిస్తోందని రఘురామ రాసుకొచ్చారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపీలను కోరారు. కొందరు మద్దతు సైతం ప్రకటించారు. దీంతో..జగన్ రఘురామ రాజు విషయంలో ఏం జరిగిందీ..సీఐడి సుమోటోగా కేసు మొదలు అన్ని అంశాలు అమిత్ షా కు వివరించే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అన్నిటికంటే ప్రధానంగా రఘురామ రాజు పైన వైసీపీ ఇచ్చిన అనర్హత పిటీషన్ పెండింగ్ లో ఉంది. దీని గురించి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రఘురామ రాజు ఇంతలా గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే...వేటు వేయాల్సిందేనని ముఖ్యమంత్రి పొలిటికల్ అజెండాలో భాగంగా కేంద్ర పెద్దలను కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఆసక్తికరంగా మారిన జగన్ ఢిల్లీ టూర్
ఇప్పటికే జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుండి ప్రతీ సందర్భంలోనూ కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. తన పైనే బురద చల్లే ప్రయత్నం చేస్తూ..జాతీయ స్థాయిలో డామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో ముఖ్యమంత్రి మౌనంగా ఉండలేరనేది వైసీపీ నేతల వాదన. దీంతో..ముఖ్యమంత్రి నిజంగా ప్రచారం జరుగుతున్నట్లుగా అదే అంశం పైన కేంద్ర పెద్దల వద్ద చర్చ చేస్తే..వారి నుండి వచ్చే రియాక్షన్..చర్యలు రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ టూర్ అధికారికంగా అనేక అంశాల పైన ఉన్నా..అందరూ మాత్రం రఘురామ రాజుకు బీజేపీ నేతలు మద్దతిస్తున్నారనే వార్తల నడుమ వారితో ఎలాంటి చర్చలు చేస్తారు..ఆ తరువాత ఏం జరగబోతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్.












Click it and Unblock the Notifications