CM Jagan: సోమ, మంగళవారాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన..
భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యల వేగం పెంచాలని సీఎం జగన్ అన్నారు. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే తాను పర్యటనలకు వెళ్లలేదని చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధితులకు అందిన సాయం, పునరావాస కార్యక్రమాలను తానే స్వయంగా సమీక్షిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. ప్రకృతి వైఫరిత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకునేందుకు ముందుగానే నిధులు, వనరులను సమకూరుస్తున్నట్లు సీఎం చెప్పారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల వేల చాలా చాకచక్యంగా వ్యవహరించిందన్నారు.
సోమ, మంగళవారాల్లో వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను తాను స్వయంగా కలుసుకోనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎక్కడా విమర్శలకు తావులేకుండా సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. గురువారం వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, సీతారామరాజు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాసం పై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

సహాయ, పునరావాస చర్యలను సమర్థంగా చేపట్టేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. బాధితులకు సరైన విధంగా సహాయం అందించేలా తగిన చర్యలు తీసుకునేందుకు సరిపడా సమయం ఇస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు పూర్తైన తర్వాత తానే క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక, పునరావాస చర్యలను పరిశీలిస్తానని పేర్కొన్నారు. ఎవరూ కూడా తమకు సాయం అందలేదని చెప్పే పరిస్థితి ఉండకూడదని జగన్ చెప్పారు.
ఇంట్లోకి వరదనీరు వస్తే కచ్చితంగా రూ.2 వేలు చొప్పున బాధితులకు అందించాలని జగన్ స్పష్టం చేశారు. మళ్లీ ఒక్కసారి పరిశీలించి ఎవరికైనా అందకపోతే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి 25 కేజీల బియ్యం, పాలు, కేజీ కూరగాయలు, కేజీ వంటనూనె, కేజీ పప్పు లాంటి సరుకులు అందించాలన్నారు.
వరద కారణంగా ఇల్లు పాక్షికంగా లేదా ధ్వంసమైతే బాధితులందరికీ రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు. వరదల తర్వాత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని.. హెల్త్ క్యాంప్ కొనసాగించాలని సీఎం జగన్ చెప్పారు.












Click it and Unblock the Notifications