కేంద్రం Vs రాష్ట్రాలు-నిన్న విజయన్,నేడు జగన్-గ్లోబల్ టెండర్లపై గొంతెత్తిన సీఎం-అందర్నీ ఏకం చేసేలా
వ్యాక్సిన్ కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న పాలసీపై రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మీ దారేదో మీరు చూసుకోండి అన్నట్లుగా ఆ విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒకరకంగా కేంద్రం తమ బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయి. గతంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదే అంశంపై లేఖలు రాశారు. నిన్నటికి నిన్న ఇదే అంశంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలోని ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాయగా... తాజాగా అదే బాటలో ఏపీ సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దీనిపై లేఖలు రాశారు.
ఒకే మాట మీద ఉందామన్న జగన్...
రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు ఒకే మాట మీద ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అంతా ఒకే గొంతుక వినిపిద్దామని సీఎంలకు రాసిన లేఖలో కోరారు. వ్యాక్సిన్ల కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదని అన్నారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. కేంద్రం,రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా పరిస్థితి మారుతోందని అభిప్రాయపడ్డారు.దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల సరఫరాలో రాష్ట్రాలన్ని పరస్పరం సహకరించుకోవాలని కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత పెంచడం దేశ తక్షణ అవసరమని అన్నారు.
ఇటీవలే 11 రాష్ట్రాల సీఎంలకు విజయన్ లేఖ
ఇటీవలే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇదే అంశంపై 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలకు అవసరమైన టీకాలను కేంద్రమే సేకరించి ఉచితంగా పంపిణీ చేయాలని... ఇందుకోసం రాష్ట్రాలన్ని ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలును కేంద్రం రాష్ట్రాలకే వదిలేయడాన్ని పినరయి విజయన్ తప్పు పట్టారు. సార్వత్రిక వ్యాక్సినేషన్ నుంచి కేంద్రం పక్కకు తప్పుకునేలా వ్యవహరిస్తోందని... ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. వ్యాక్సిన్ల సేకరణ బాధ్యత రాష్ట్రాలదేనని పదేపదే ప్రకటనలు చేయడం సమాఖ్య వ్యవస్థ స్పూర్తిని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీదీ డిమాండ్ ముందు నుంచి అదే...
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వ్యాక్సిన్ల విషయంలో కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల సమయం నుంచే ఆమె దీనిపై ఘాటుగా మాట్లాడుతున్నారు. దేశమంతా కేంద్రమే ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మహా అయితే ఇందుకోసం రూ.30వేల కోట్లు ఖర్చవుతాయని చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనను ఆమె కొట్టిపారేశారు. అదంతా వట్టి బూటకమని బుధవారం(జూన్ 3) వ్యాఖ్యానించారు.
నిన్నటికి నిన్న నవీన్ పట్నాయక్ లేఖ...
'దేశమంతా ఒక్కటై కరోనా మహమ్మారిని తరిమేద్దాం. ప్రజల ప్రాణాల్ని కాపాడుకుందాం. ఏకీకృత టీకాల కొనుగోలు విధానం పట్ల తీర్మానాలతో అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలి.' అని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అందరూ ముఖ్యమంత్రులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లేఖలు రాశారు. కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాల మధ్య పోరు తగదని హితవు పలికారు. రాజకీయ, ఇతర భేదాభిప్రాయాలకు అతీతంగా అందరం ఒక్కటై కరోనా మహమ్మారి పోరులో పాలుపంచుకుందామని పిలుపునిచ్చారు. ఇంతకుముందు పలువురు ముఖ్యమంత్రులతో ఈ మేరకు ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపినట్లు లేఖలో పేర్కొన్నారు.
Recommended Video
కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు
వ్యాక్సిన్ల సేకరణ విషయంలో పరిస్థితి కేంద్రం వర్సెస్ రాష్ట్రాలుగా మారుతోంది. గత నెలలో ఢిల్లీ,పంజాబ్ రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లగా మోడెర్నా,ఫైజర్ వంటి అంతర్జాతీయ కంపెనీలు దాన్ని తిరస్కరించాయి. తాము నేరుగా కేంద్రంతోనే డీల్ చేస్తామని రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసేది లేదని తేల్చి చెప్పాయి. దీంతో రాష్ట్రాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. రాష్ట్రాలకు వ్యాక్సిన్లు విక్రయించేలా అంతర్జాతీయ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదా... కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే కోవాగ్జిన్,కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఫార్ములాలను దేశంలోని ఇతర మాన్యుఫాక్చరర్స్కి కూడా ఇచ్చి ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలన్ని దీనిపై ఏకమయ్యే దాకా కేంద్రం తాత్సారం చేస్తుందో లేక ముందుగానే మేలుకొంటుందో వేచి చూడాలి.