జగన్ మరో ప్రయోగం-తిరుపతి ఓటర్లకు లేఖ- వైసీపీకే ఎందుకు ఓటేయాలంటే..
ఏపీలో త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నిక అధికార వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ-జనసేనకు కూడా కీలకంగా మారింది. పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న వైసీపీ ఈ ఎన్నికలోనూ గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా.. టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో రెండేళ్ల విరామం తర్వాత ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో తిరుపతి ఓటర్లకు ముందుగా జగన్ ఓ లేఖ రాశారు. రెండేళ్ల కాలంలో వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

జగన్ మరో కొత్త ప్రయోగం
తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తిని రికార్డు మెజారిటీతో గెలిపించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలను ప్రచారంలోకి దింపిన వైసీపీ అధినేత జగన్ త్వరలో తానే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అంతకు ముందే మరో కొత్త ప్రయోగానికి తెరదీశారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఓటర్లకు ఆయన తాజాగా ఓ విజ్ఞప్తి చేశారు. ప్రచార బరిలోకి తాను దిగే ముందు వారిని సన్నద్ధం చేసేలా ఈ ప్రయోగానికి ఆయన శ్రీకారం చుట్టారు.

తిరుపతి ఓటర్లకు జగన్ లేఖాస్త్రం...
తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న కుటుంబాలకు వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇవాళ లేఖలు రాశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 నెలల్లో వైసీపీ సర్కారు చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఇందులో వివరించారు.
తిరుపతిలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్ల జరిగిన లబ్దిని ఓటర్లకు జగన్ లేఖలో వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై సంతకం చేసిన జగన్, మిగతా లేఖను పార్టీ నేతల ద్వారా తిరుపతి ఓటర్లకు పంపుతున్నారు.

రెండేళ్లలో వైసీపీ సర్కార్ చేసింది ఇదే
రెండేళ్లలో వైసీపీ సర్కారు తీసుకొచ్చిన వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైయస్సార్చేయూత, వైయస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్యారంగాలు, వ్యవసాయం, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను జగన్ ఈ లేఖల్లో ప్రస్తావించారు.

ప్రతిపక్షాలపై విమర్శలకు దూరం
సీఎం జగన్ తన లేఖలో రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేయడంతో పాటు గురుమూర్తికి ఓటేసి గెలిపించాలని మాత్రమే కోరారు. విపక్షాలపై విమర్శల జోలికి జగన్ పోలేదు. తమ ప్రభుత్వ దార్శనికతను, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకున్న విధానాన్ని మాత్రమే ప్రస్తావించారు. తద్వారా ఎెన్నికలంటే రాజకీయంగా మారిపోయిన తరుణంలో కొత్త ఒరవడికి జగన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉపఎన్నికలో గురుమూర్తిని గెలిపించాలని కోరుతూ జగన్ రాసిన లేఖలను పార్టీ నేతలు రేపటి నుంచి తిరుపతి లోక్సభ స్ధానం పరిధిలోని కుటుంబాలకు స్వయంగా అందించబోతున్నారు.












Click it and Unblock the Notifications