సీఎం రమేష్ దీక్ష విరమణ: కేంద్రం, జగన్ నాటకాలంటూ చంద్రబాబు ఆగ్రహం
Recommended Video

కడప: కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ సీఎం రమేశ్ చేస్తోన్న ఆమరణ నిరాహారదీక్ష 11వ రోజుకు చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శనివారం ఆయనను పరామర్శించారు.
కాగా, ఎంపీ రమేష్కి రిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం రమేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు వెల్లడించారు. సీఎం పరామర్శించేందుకు రావడంతో దీక్షతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బీటెక్ రవిని పార్టీ నేతలు దీక్షాస్థలికి తీసుకొచ్చారు. రవిని కూడా సీఎం పరామర్శించారు.

ఆమరణ దీక్ష చేస్తే పట్టించుకోరా?
సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఓ ఎంపీ ఆమరణ దీక్ష చేస్తుంటే పట్టించుకోరా? అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తగ్గారు ప్రాణాలు లెక్క చేయకుండా
ప్రాణం పోయినా పరవలేదని ఉక్కు సంకల్పంతో ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. బీటెక్ రవి ఆరోగ్య సమస్యలున్నప్పటికీ ఏడురోజులపాటు దీక్ష చేశారని అన్నారు. సీఎం రమేష్ ఆమరణ దీక్షతో 6కిలోల బరువు తగ్గారని చంద్రబాబు చెప్పారు. కిడ్నీ, లివర్ దెబ్బతినే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పారని తెలిపారు.

రమేష్ ఆరోగ్య రహస్యమేంటని అడుగుతారా?
తాను కూడా విభజన సమయంలో నిరవధిక దీక్ష చేశానని, రైతుల కోసం 7రోజులపాటు దీక్షలు చేశానని చంద్రబాబు చెప్పారు. ఉక్కు పరిశ్రమ కోసం చిత్తశుద్ధితో సీఎం రమేష్ దీక్ష చేస్తుంటే కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రమేష్ ఆరోగ్య రహస్యం ఏంటని ప్రశ్నిస్తున్నారని.. వైద్యులను అడిగితే ఆ విషయం తెలుస్తుందని అన్నారు.

గాలి, జగన్ నాటకాలు
దీక్షలపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గాలి జనార్ధన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని చంద్రబాబు అన్నారు. గాలి, జగన్ లతో కలిసి కేంద్రం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. మోసాలు మంచిది కాదన్నారు.

సాధించి తీరుతాం
కేంద్రం దిగివచ్చే పరిస్థితులు తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు.ఉక్కు పరిశ్రమను సాధించి తీరుతామని అన్నారు. కేంద్రం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుంటే తామే ఏర్పాటు చేస్తామని అన్నారు.
‘విభజన చట్టం ప్రకారం ఆరు నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉంది. ఏపీకి అన్యాయం చేస్తే ఖబడ్దార్.. వదిలే ప్రసక్తే లేదు. 5 కోట్ల ఏపీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే సగం ఖర్చు భరిస్తాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

నిమ్మరసం ఇచ్చి సీఎం రమేష్ దీక్ష విరమింపజేశారు
చంద్రబాబు తన ప్రసంగం ముగించిన అనంతరం సీఎం రమేష్కు నిమ్మరసం తాగించి ఆమరణ దీక్ష విరమింపజేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవికి కూడా చంద్రబాబు నిమ్మరసం తాగించారు. దీంతో 11రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్ తన దీక్షను విరమించుకున్నట్లయింది.












Click it and Unblock the Notifications