జగన్ జైలుకు వెళ్లే టైమొచ్చింది, ముఖ్యమంత్రా...: సిఎం రమేష్
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కాదు, త్వరలోనే శిక్ష ఖాయమవుతుందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అన్నారు. జగన్ జైలుకు వెళ్తే వైయస్సార్ కాంగ్రెస పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన అన్నారు.
ఈ పరిస్థితుల్లో క్యాడర్లో, నాయకుల్లో ఆశలు రేపేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప, పులివెందులలోనే ఆయన కార్యక్రమాలకు జనం రావడం లేదని, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాననుకోవడం మూర్ఖత్వం అని విమర్శించారు.
కడప జిల్లా పోట్లదుర్తికి వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ వస్తే ఏటా రూ.2 వేల కోట్ల మేరకు సాయం అందినా... అందులో 90 శాతం గ్రాంట్ ఉంటుందని ఆయన చెప్పారు.
ప్యాకేజి ద్వారా ఏటా 5 వేల నుంచి 10 వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉందని, ఆమేరకు ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ రకంగానే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. హోదాను పట్టుకుని రాజకీయం చేయాలని జగన్ నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు.