జగన్ అన్నింటా అసమర్థుడు... పవన్కు భయపడుతున్నారు... వైసీపీ నేతలకు నిద్ర కరువైంది : సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నింటిలో అసమర్థుడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వాలంటీర్లను ఉపయోగించుకుని కుట్రలు పన్నుతున్నారని... ప్రజలు స్వేచ్చగా ఓటు వేయకుండా చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు భయపడుతున్నారని... బీజేపీకి వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలకు నిద్ర కూడా పట్టట్లేదని విమర్శించారు. తిరుపతి ఉపఎన్నికలో ప్రజలు వైసీపీకి బుద్ది చెబుతారని అన్నారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు గడువు దగ్గర పడటంతో సోము వీర్రాజు అధికార పార్టీపై విమర్శల పదును పెంచారు. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులన్నీ కేంద్రం నుంచి వస్తున్నవేనని మంగళవారం(ఏప్రిల్ 13) ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్దిలో కేంద్రం వాటాపై టీడీపీ, వైసీపీతో తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయన్నారు.క్రైస్తవులకు తాము వ్యతిరేకం కాదని... కొంతమంది వైసీపీ నేతలు చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని అన్నారు. తాము స్వామి వారి నామం పెట్టుకుంటే వైసీపీ మంత్రులు హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలోనూ అన్యమతస్తులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మతతత్వ వైఖరిని బీజేపీ ఖండిస్తోందన్నారు.
మరోవైపు సోము వీర్రాజు విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ను చూసి వైసీపీ భయపడుతోందన్న విమర్శలను ఆయన తిప్పి కొట్టారు.పవన్ కల్యాణ్ తిరుపతి ప్రచారాన్ని రద్దు చేసుకున్నది కోవిడ్కి భయపడా.. లేక ప్యాకేజీ అందలేదని బాధపడా...? అంటూ విమర్శలు చేశారు.జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి టీడీపీ అధ్యక్షుడి స్థాయికి పడిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబుపై రాళ్ల దాడి పెద్ద డ్రామా అని విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని.. వైసీపీని ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా,ఈ నెల 17న తిరుపతి ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించినప్పటికీ కోవిడ్ వ్యాప్తి కారణంగా రద్దు చేసుకున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా క్వారెంటైన్లోకి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం(ఏప్రిల్ 15) ఉపఎన్నికకు ప్రచారం ముగియనుంది.ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి.