ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు; గవర్నర్ తో పాటు ప్రముఖుల శుభాకాంక్షలు
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా అచ్చమైన తెలుగు సంప్రదాయంలో ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి వస్త్రాలతో, చక్కని వస్త్రధారణలో కనిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటుగాఅయన సతీమణి భారతీ రెడ్డి కూడా సంప్రాదాయ చీరకట్టులో మెరిసిపోయారు.

ఉగాది వేడుకలలో సాంప్రదాయ వస్త్ర ధారణలో సీఎం జగన్ దంపతులు
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం తెలుగు రాష్ట్రాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఏపీ సీఎం కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాంప్రదాయమైన దుస్తులలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పర్వదిన వేడుకలకు హాజరయ్యారు.
ఉగాది ఉత్సవాలను ప్రారంభించిన సీఎం జగన్.. హాజరైన పలువురు మంత్రులు, వైసీపీ ప్రముఖులు
అంతకుముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ ఉన్న చిన్నారులు అందరినీ ఆప్యాయంగా పలకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఉగాది వేడుకల్లో, పంచాంగ శ్రవణం లో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, వైయస్సార్సీపి కీలక నేతలు పాల్గొన్నారు.

శుభకృత్ పేరుకు తగ్గట్టే మంచి పాలన అందిస్తారని సీఎం జగన్ కు తెలిపిన సిద్ధాంతి
దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శుభకృత్ నామ సంవత్సరం పేరుకు తగినట్లుగా అన్ని శుభాలే జరుగుతాయి అని సీఎం జగన్ చల్లని పాలన కు తగ్గట్టే ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని, శుభకృత్ పేరుకు తగ్గట్టే మంచి పాలన అందిస్తారని సీఎం జగన్ మోహన్ రెడ్డి ని సిద్ధాంతి ఆశీర్వదించారు. అనంతరం పంచాంగకర్తలు సీఎం వైఎస్ జగన్ సన్మానం చేయగా, శారదా పీఠం తరఫున జగన్ కు సిద్ధాంతి వస్త్రాలను అందజేశారు.
ఏపీ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు, జగన్ ఉగాది ఆకాంక్ష
ఇదిలా ఉంటే శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఆరంభం సందర్భంగా ఏపీ లోని ప్రముఖులు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల రుచులను ఉగాది పచ్చడిలా అనుభవించటానికి సిద్ధంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాదితో ప్రతిఇంటా సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు నిండి ఉండాలని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుకున్నారు. రైతులకు మేలు కలగాలని, అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలని పేర్కొన్నారు.

ప్రజల కష్టాలు తొలగిపోవాలన్న చంద్రబాబు, పాలకుల మనసు మారాలన్న పవన్ కళ్యాణ్
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కష్టాలు తొలగాలని చేదు తొలగి తీపి మిగలాలని చంద్రబాబు ఆకాంక్షించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు వారి ఉగాది కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలపై ధరల ఘాతాలు, పన్ను పోటు లేని పాలన అందించేలా పాలకుల మనసు మార్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications