Jagananna thodu: రెండో విడత సంక్షేమం..నగదు బదిలీ: 3.70 లక్షల మందికి బెనిఫిట్
అమరావతి: వీధి వ్యాపారులకు ఆర్థికంగా చేయూతను అందించడానికి ఉద్దేశించిన జగనన్న తోడు రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు. ఈ పథకం కింద 3 లక్షల 70 వేల మంది లబ్దిదారులకు 10,000 రూపాయల వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిధులను వారి అకౌంట్కు బదలాయించారు. మొత్తం 370 కోట్ల రూపాయల మేర నగదును వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
Recommended Video

కష్టాలు స్వయంగా చూశా..
తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని, వారికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జగనన్న తోడు పథకాన్ని రూపొందించామని, దాన్ని అమలు చేస్తోన్నామని అన్నారు. ఈ పథకం కింద వడ్డీ రహిత రుణాలను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని చెప్పారు.

రెండో విడతలో రూ.370 కోట్లు..
గత ఏడాది 5.35 లక్షల మందికి ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం కల్పించగా, ఈ ఏడాది అదనంగా మరో 3.7 లక్షల మంది చిరు వ్యాపారులను అర్హులుగా గుర్తించామని, వారి కోసం రూ.370 కోట్ల రుణాలను మంజూరు చేశామని చెప్పారు. చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం బడా వ్యాపారుల చుట్టూ తిరగకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని, అలాంటి వారి ఆగడాలకు గురి కాకూడదన్నలక్ష్యంతో కరోనా కాలంలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు.

ఫైనాన్షియర్లను ఆశ్రయించి.. ఇబ్బందులు
బ్యాంకుల నుంచి రుణాలు పుట్టకపోవడం వల్ల చిన్న వ్యాపారులు అష్టకష్టాలు పడుతున్న విషయం తన పాదయాత్ర ద్వారా తెలిసిందని, అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న తోడు పథకాన్ని రూపొందించామని అన్నారు. తన పాదయాత్ర సందర్భంగా చిరు వ్యాపారుల వ్యథలను ఎన్నో చూశానని, వారి దుస్థితిని దగ్గరుండి చూశానని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇలాంటి వారికి తక్కువ వడ్డీకి రుణాలు అందని పరిస్థితి తన దృష్టికి వచ్చిందని చెప్పారు. గత్యంతరం లేక ప్రైవేట్ వ్యక్తులు, ఫైనాన్షియర్ల వద్ద వారు అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని అన్నారు.

అందుకే జగనన్న తోడు..
ఈ దుస్థితిని నిర్మూలించడానికి జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టామని, దాన్ని మేనిఫెస్టోలో పెట్టామని అన్నారు. గత ఏడాది కూడా ఈ పథకం ద్వారా సాయం చేశామని, రెండో విడతగా మిగిలిన 3.70 లక్షల మందికి కూడా బ్యాంకులతో మాట్లాడి రుణాలు అందేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ రుణాలు అందించే ఏర్పాట్లు చేశామని వైఎస్ జగన్ చెప్పారు. రెండోవిడత కింద 370 కోట్ల రూపాయలను చిరువ్యాపారులకు రుణాల రూపంలో ఇస్తున్నామని అన్నారు.

తొమ్మిదిన్నర లక్షలమందికి
గతంలో తొలి విడతలో ఇచ్చిన వారికి వడ్డీ సొమ్ము కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. మొత్తంగా 9.5 లక్షల మందికి ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. అర్హత ఉండి రుణాలు అందకపోతే..ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని, సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త దరఖాస్తుదారులకు వలంటీర్లు తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications