సీఎం జగన్ అపరిచితుడి నిర్ణయాలతో రాష్ట్రవిభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది: చంద్రబాబు
టిడిపి అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రివర్స్ లో నడుస్తోందని విమర్శలు గుప్పించారు. సోమవారం టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై, జగన్ మోహన్ రెడ్డి పాలన పై మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలనపై నిత్యం మండిపడుతున్న చంద్రబాబు తాజా పరిణామాలపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాని హస్తముంది
సీఎం మోసపు రెడ్డి పాలనతో అన్ని వర్గాల జీవితాలలో అంధకారం నెలకొంది అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ అపరిచితుడు నిర్ణయాలతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంత వర్గం కూడా తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాని హస్తముందని చంద్రబాబు ఆరోపించారు.
ముఖ్యమంత్రి ఎంత బలహీనుడో తన క్యాబినెట్ చూస్తే అర్థమవుతుంది
వైసీపీ నేత కాకాని మంత్రి అయిన గంటల వ్యవధిలోనే ఆయన పై తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన ఫోర్జరీ కేసు ఆధారాలు ఏకంగా కోర్టు నుంచే దొంగిలించబడ్డాయని దొంగలు అన్నీ వదిలేసి కేవలం ఆ కేసు తాలూకు ఆధారాలను ఎందుకు తీసుకు వెళ్లారనేది పోలీసులు చెప్పాలంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఎంత బలహీనుడో తన క్యాబినెట్ చూస్తే అర్థమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ ఇస్తామని చెప్పి, అందుకోసం వాలంటీర్లను పెట్టాను అని చెప్పిన జగన్ ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేక పోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్ళింది అక్కడ దోపిడీ కోసమేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీన టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చంద్రబాబు వెల్లడించారు.