జగన్ చేతికి ఐప్యాక్ రిపోర్ట్- ఎమ్మెల్యేలతో భేటీ: ఆ ఎమ్మెల్యేలకు టికెట్ కష్టమే..!!
అమరావతి: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని, 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం వైనాట్ 175 కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ విషయంలో రాజీపడట్లేదు. సరిగ్గా పనిచేయని, జనంలో లేని ఎమ్మెల్యేలకు టికెట్ల దక్కబోవంటూ ఇదివరకే హెచ్చరించారు కూడా. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొలమానంగా తీసుకుంటోన్నారు.

ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్బ్యాక్ను వైఎస్ జగన్ ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. దీని ఆధారంగానే టికెట్లను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే- నాలుగైదు సార్లు ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.
తాజాగా మరో విడత భేటీ కానున్నారు. ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.. ఇందులో పాల్గొననున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటోన్నారు?, సమస్యల పరిష్కారం చూపుతున్న చొరవ, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై ఇప్పటికే ఆయన ఓ నివేదికను తెప్పించుకున్నారు.

వైఎస్ఆర్సీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తోన్న ఐప్యాక్ టీమ్ రూపొందించిన నివేదిక ఇది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆధారంగా, స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచీ సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపరిచింది ఐప్యాక్ టీమ్. దీని ఆధారంగా ఎమ్మెల్యేల భవిష్యత్ను నిర్ణయించనున్నారు వైఎస్ జగన్.
మొత్తంగా 32 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఐప్యాక్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వారు తమ పనితీరును మెరుగుపర్చుకుంటే తప్ప టికెట్ కేటాయించడం అసాధ్యమౌతుందనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోన్నాయి. 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరాలంటే.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు వైఎస్ జగన్.
టికెట్లను కేటాయించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తర-తమ తేడాను ఆయన చూడదలచుకోలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. మొహమాటాలకు అస్సలు వెళ్లకూడదనే భావనలో ఉన్నారని చెబుతున్నాయి. ఈ సారి క్లీన్ స్వీప్ చేయగలిగితే- జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయొచ్చనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది.












Click it and Unblock the Notifications