రేపు స్వరూపానందతో భేటీ కానున్న సీఎం జగన్ ... స్వామీజీతో భేటీపై సర్వత్రా ఆసక్తి
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం నాడు విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించనున్న నేపధ్యంలో ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జగన్ విశాఖకు వెళ్లనున్నారు.మంగళవారంనాడు ఉదయం 11 గంటలకు అమరావతి నుండి విశాఖపట్టణానికి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ విశాఖ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా శారదా పీఠానికి చేరుకొంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేరుగా శారద పీఠానికి చేరుకొని ఆయన ఆశీస్సులు తీసుకొంటారు. సుమారు రెండు గంటల పాటు విశాఖలో శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామితో భేటీ అవుతారు. మంత్రివర్గ విస్తరణ కోసం వైఎస్ జగన్ సీఎం శ్రీ శారదా పీఠాధిపతి సలహాలను తీసుకొంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది . ఈ నేపధ్యంలోనే జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక శారదా పీఠాధిపతి స్వరూపానంద సామితో భేటీ అనంతరం జగన్ అమరావతికి చేరుకుంటారు. వివిధ శాఖల సమీక్షల్లో పాల్గొంటారు.

ఎన్నికలకు ముందు శారదా పీఠాధిపతిని కలిసి జగన్ ఆశీస్సులు తీసుకొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో రెండు దఫాలు హోమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.జగన్ ఎన్నికలకు ముందు ఏ పని చేసినా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ ఆశీర్వాదంతోనే చేశారు. ఆయనపట్ల జగన్ యెనలేని గౌరవాన్ని ప్రదర్శిస్తారు. కనుకే వైసీపీ నుండి రాజకీయ ప్రముఖులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీర్వాదం కోసం బారులు తీరుతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిన్న జీయర్ స్వామి ఎలాగో అలాగే జగన్ కు స్వరూపానందేంద్ర సరస్వతి అని ఏపీలో అంతా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే రాజకీయ ప్రముఖుల క్యూ శారదా పీఠానికి పెరిగింది.












Click it and Unblock the Notifications