ఏపీఎన్జీవో మహాసభలకు వైఎస్ జగన్: ఉద్యోగులకు వరాలు..?!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్.. మహాసభలకు సర్వం సిద్ధమైంది. సోమ, మంగళ వారాల్లో ఈ రాష్ట్రస్థాయి మహాసభలు జరుగనున్నాయి. 21వ మహాసభలు ఇవి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రతిష్ఠాత్మకంగా వీటిని నిర్వహించనున్నారు ఏపీఎన్జీవోలు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఏపీఎన్జీవో నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. 25 వేల మందికి పైగా ఉద్యోగులు, ఏపీఎన్జీవో సభ్యులు, జిల్లాస్థాయి నాయకులు, ప్రతినిధులు హాజరు కావొచ్చనే అంచనాలు ఉన్నాయి.

మహాసభల మొదటి రోజు సమావేశానికి వైఎస్ జగన్.. ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 11:45 నిమిషాలకు ఆయన విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి హామీలు, వరాలు ఇస్తారనేది ఉత్కంఠతగా మారింది.
తమ మహాసభలకు హాజరు కావాలంటూ ఏపీఎన్జీవోల అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఇదివరకే.. వైఎస్ జగన్ను కలిసిన విషయం తెలిసిందే. ఆయనకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సభల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల.. ఎదుర్కొంటోన్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన 12వ పీఆర్సీ కమిషన్ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఈ పీఆర్సీ కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఛైర్మన్గా నియమించింది ప్రభుత్వం.
కరోనా వైరస్ సోకి మృత్యువాత పడిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఒకేసారి కారుణ్య నియామకాలు చేపట్టడానికీ ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీన్ని మరింత సరళీకరించాలని, ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని ఏపీఎన్జీవో నాయకులు కోరుకుంటోన్నారు. ఈ విషయంపైనా మహాసభల్లో చర్చిస్తారు.












Click it and Unblock the Notifications