కోల్స్కాం కేసు: దాసరి, జిందాల్ ప్రమేయంపై తుది నివేదికకు మరింత గడువు
కోల్ స్కాం కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, పారిశ్రామికవేత్త-కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్ తదితరుల ప్రమేయానికి సంబంధించిన కేసు దర్యాప్తు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, పారిశ్రామికవేత్త-కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్ తదితరుల ప్రమేయానికి సంబంధించిన కేసు దర్యాప్తు తుది నివేదికను నిర్దుష్ట నమూనాలో సమర్పించేందుకు ప్రత్యేక కోర్టు సీబీఐకి మరికొంత గడువు మంజూరుచేసింది.
నివేదిక తయారీ పూర్తయిందని, దానిని సీనియర్ అధికారులకు పంపించానని, అందుచేత సమయమివ్వాలని ప్రత్యేక కోర్టు జడ్జి భరత పరాశర్ను సీబీఐ దర్యాప్తు అధికారి సోమవారం అభ్యర్థించారు. ఈ మేరకు తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 6న తేదీన తుది నివేదికను సమర్పించాలని జడ్జి ఆదేశించారు.
కాగా, దర్యాప్తు పూర్తయినట్లు పేర్కొంటూ.. సీబీఐ గతంలోనే నివేదిక ఇచ్చింది. అందులో ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదిక, డాక్యుమెంట్లు, సాక్షుల జాబితాలు కూడా అందులో ఉన్నాయి. అయితే అది నిర్దుష్ట రూపంలో లేదు. తుది నివేదిక సమర్పించకపోవడం వల్ల విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు గతంలోనే ఆక్షేపించింది. ఈ క్రమంలోనే సీబీఐకి కోర్టు గడువును మంజూరు చేసింది.