ఏపి పై పెథాయ్ పంజా : కోస్తా పై అధిక ప్రభావం
ఆంధ్రప్రదేశ్ను వరుస తుఫానులు గడగడలాడిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు కోస్తా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఇందులో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తుఫాను ప్రమాదం ఉందని కలెక్టర్లకు హెచ్చరించారు. తుఫాను కంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.ప్రతి క్షణం ఆయన రానున్న తుఫాను పరిస్థితిపై సమీక్షిస్తూ అవసరమైన చోట్లు రెస్క్యూ సిబ్బందిని ఉంచుతున్నారు.
రాష్ట్ర సచివాలయంలో ఒక కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో ముందస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు.ఆగ్నేయ బంగాళా ఖాతం కేంద్రంగా అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు తుఫాను ముప్పు ఉంటుందని వెదర్ డిపార్ట్ మెంట్ సూచించింది. గురువారం రాత్రి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయువ్య దిశగా పయనిస్తోందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబరు 17న ఒంగోలు, కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆసమయంలో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.
డిసెంబర్ 15న ఏపీ మరియు ఉత్తర తమిళనాడులో తీరం దాటుతున్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని డిసెంబర్ 17 నాటికి పరిస్థితి తీవ్రతరం అవుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదకర స్థాయి పరిస్థితి ఉన్నట్లు తమకు అనిపించలేదని చెప్పిన అధికారులు... డిసెంబర్ 17నాటికి ఏమవుతుందో ఇప్పుడు అప్పుడే చెప్పలేమన్నారు. ఈ మధ్యనే తమిళనాడును తాకిన గజ తుఫాను కంటే ఈ పైథా తుఫాను ప్రమాదకరంగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కోస్తా జిల్లాల అధికారులు 24 గంటలు విధుల్లోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా మత్య్సకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా చూడాలని..లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. ఇప్పటికే 50 మంది జాలర్లు గల్లంతు అయి నట్లుగా రిపోర్టులు వస్తున్నాయి. దీంతో..ప్రభుత్వం మరింత అప్రమత్తత ప్రకటించింది.