మంత్రి లోకేష్ వెళ్తుంటే...ఎమ్మెల్యే జగన్ రాలేరా ..?
ఏపీలో గతంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో విపక్ష నేతగా ఉండగా వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి వ్యవహారం ఇప్పటికీ తేలడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ కేసులో బాధితుడైన జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోవడమే. అయితే ఈ కేసులో నిందితుడికి ఎలాంటి దురుద్దేశాలు లేవని, కుట్ర కోణం కూడా లేదని గతంలో ఎన్ఐఏ తేల్చేసింది. దీనిపై జగన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్ఐఏ లోతుగా విచారణ జరుపుతోంది.
గతంలో సీఎంగా ఉండగా తాను కోర్టుకు రావడం సాధ్యం కాదని, బిజీగా ఉంటానని, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని పలు కారణాలు చెప్పిన జగన్.. ఇప్పటికీ ఎన్ఐఏ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోవడంపై నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు లాయర్లు మండిపడుతున్నారు. ఇప్పుడు కేవలం ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి కోర్టుకు రావడానికి అభ్యంతరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

ఇవాళ విశాఖ ఎన్ఐఏ కోర్టులో మరోసారి ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ హాజరుకాకపోవడంపై నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ లాయర్ సలీం కోర్టులో అభ్యంతరం తెలిపారు. మంత్రిగా ఉన్న నారా లోకేష్ సాక్షిపై పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరవుతుంటే, కేవలం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ రావడానికి అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీంతో వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications