జగన్ ను అందుకే పొడిచా..! కోడి కత్తి శ్రీను వాంగ్మూలంలో సంచలన విషయాలు...
ఏపీలో నాలుగేళ్ల క్రితం 2019 ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేసి వార్తల్లోకెక్కిన నిందితుడు జనిపల్లి శ్రీనివాస్.. ఎన్ఐఏ కు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన అంశాలు వెల్లడించాడు. ఇందులో జగన్ పై కోడికత్తి దాడి చేయడానికి దారి తీసిన పరిణామాల్ని వెల్లడించాడు. తాజాగా విజయవాడ కోర్టులో ఎన్ఐఏ సమర్పించిన కౌంటర్ లో దీన్ని చేర్చారు. ఇందులో పలు సంచలన అంశాలున్నాయి.
నాలుగేళ్ల క్రితం వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో ఎన్ఐఏ కు వీటిని నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ అంశాలున్నాయి. తాజాగా విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన కౌంటర్ లో ఎన్ఐఏ అధికారులు ఈ వాంగ్మూలం జత చేశారు. ఇందులో జనిపల్లి శ్రీనివాస్.. తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని అని పేర్కొన్నాడు. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నానని, ప్రజల్లో సానుభూతి కోసం జగన్పై అటాక్ చేశానని వెల్లడించాడు.

కోడికత్తి దాడితో మీడియా ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించినట్లు జనిపల్లి శ్రీను తెలిపాడు. ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించానన్నాడు. జగన్కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పానని శ్రీను తెలిపాడు. తన మాటలకు జగన్ చిరునవ్వు చిందించారన్నాడు. అటాక్ జరిగిన వెంటనే వైసీపీ వారు తనపై దాడి చేశారన్నాడు. పోలీసులు తనను కాపాడి ఓ గదిలో బంధించారని వెల్లడించాడు. అనంతరం పోలీస్స్టేషన్కు తరలించారన్నాడు.

అప్పట్లో ఆంధ్రా పోలీసులు తనను బాగా కొట్టారని జనిపల్లి శ్రీను ఎన్ఐఏకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారని విచారణ చేశారని, తన సొంత ఆలోచనతోనే దాడికి పాల్పడ్డానని చెప్పానన్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెప్పానన్నాడు. కట్టు కథలు చెప్పాలని పోలీసులు తనపై ఎలాంటి ఒత్తిడి తేలేదని, అందువల్లే జడ్జి దగ్గర తాను పోలీసులపై ఏ ఆరోపణలు చేయలేదన్నాడు. ఇదే అంశంపై ఓ 24 పేజీల పుస్తకం రాశానని, పుస్తకం పూర్తి చేద్దామంటే విశాఖ జైలు సిబ్బంది లాగేసుకున్నారన్నాడు. ఈ సంఘటన తప్పు అని తనకు తెలుసని, జగన్కు అధికారం రావాలనే అభిమానంతో దాడికి పాల్పడ్డానని జనిపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications