ఎంత చెప్పినా విన్లేదు.. సస్పెన్షన్, రోజా వీడియో లీకేజ్పై కమిటీ: కోడెల
గుంటూరు: రోజాపై సస్పెన్షన్, అసెంబ్లీ ప్రొసీడింగ్ వీడియోలు బయటకు వచ్చిన అంశంపై సభాపతి కోడెల శివప్రసాద రావు గురువారం నాడు విలేకరులతో మాట్లాడారు. వీటికి సంబంధించి ఓ కమిటీని వేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మీడియా సమావేశంలో కోడెల మాట్లాడుతూ... తన రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడలేదని వైసిపిపై మండిపడ్డారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు. వైసిపి సభ్యురాలు రోజాను వారించి, వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే సస్పెన్షన్ చర్య తీసుకోవడం జరిగిందని తెలిపారు.
శాసన సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. సభాపతిగా నేను ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించనని స్పష్టం చేశారు. తన పైన వైసిపి సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. తన పైన అవిశ్వాసం ఇవ్వడం.. సభ్యులుగా వారికి ఉన్న హక్కు అన్నారు.
స్పీకర్గా నేను నా బాధ్యతల నుంచి వెనక్కి తప్పుకునేది లేదన్నారు. ఏ పార్టీకి అనుకూలంగా ఉండనని చెప్పారు. అసెంబ్లీ తీర్మానం చేశాకే రోజా పైన సస్పెన్షన్ వేశానని చెప్పారు. అసెంబ్లీ ప్రొసీడింగ్ వీడియోలను అందరికీ ఇచ్చామని చెప్పారు.
సభ్యుల సస్పెన్షన్, సోషల్ మీడియాలో వీడియో లీకేజీ పైన డిప్యూటీ స్పీకర్ చైర్మన్గా మూడు పార్టీలతో విచారణ కమిటీ వేస్తామన్నారు. వీడియో లీకేజీ, రోజా సస్పెన్షన్ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. రోజాతో పాటు ఇతర సభ్యుల పైన సస్పెన్షన్ పెంచాలన్నా, తగ్గించాలన్నా అది కమిటీ బాధ్యత అన్నారు.
ఈ కమిటీలో మూడు పార్టీల నుంచి ముగ్గురు సభ్యులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ అసభ్యంగా మాట్లాడిన ఇతర సభ్యుల పైన కూడా విచారణ జరుపుతుందన్నారు. నిన్ననే మూడు పార్టీల వారికి అసెంబ్లీ ప్రొసీడింగ్కు సంబంధించి వీడియోలు ఇచ్చామని చెప్పారు.
క్లిప్పింగులు పార్టీలకు ఇవ్వడానికి ముందే వీడియోల లీక్ గురించి తనకు తెలియదన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు రావడం పైన విచారణ జరిపిస్తామని తెలిపారు. రోజా పైన సస్పెన్షన్ నా ఒక్కడి నిర్ణయం కాదని, అసెంబ్లీ తీర్మానించాకే సస్పెన్షన్ విధించామన్నారు. అది సభ నిర్ణయమని తెలిపారు.
సభలో సభ్యుల ప్రవర్తనను ప్రజలు గమనించారన్నారు. ఒక పార్టీకి కొమ్ముకాయాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. నేను ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికయ్యానననే విషయం తనకు గుర్తుందని చెప్పారు. సస్పెన్షన్, ఇతర సభ్యుల పైన చర్యలు, వీడియో లీకేజ్ పైన వచ్చే సమావేశాల నాటికి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు.