బ్యాంకుల సంగతేంటో తేలుద్దాం రండి: విపరీతంగా 'ట్రెండ్' అవుతోన్న మెసేజ్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మెసేజ్ బ్యాంకుల తీరుకు నిరసనగా 'నో బ్యాంకింగ్ డే' జరపాలన్న పిలుపునిస్తోంది.
హైదరాబాద్: ఒకప్పుడు థియేటర్ లోకి వెళ్లి కూర్చోగానే.. 'నా పేరు ముఖేష్..' అంటూ పొగాకు ఉత్పత్తుల పట్ల అప్రమత్తం చేసే ఓ ప్రోమో స్క్రీన్ పై దర్శనమిచ్చేది. అది జనాలకు ఎంతగా దగ్గరయిందంటే.. ఇటీవలి కాలంలో జనాలకు అసౌకర్యం కలిగించే విషయమేదైనా అందులోకి ముఖేష్ చొరబడిపోతున్నాడు. అంటే, ముఖేష్ లాంటి మాట తీరుతో ఆ సమస్యలను జనం ఏకరువు పెడుతున్నారని అర్థం.
సామాన్యుడి మీద బ్యాంకుల దండయాత్ర: స్టేట్ బ్యాంకు కూడా బాదేయనుంది..
తాజాగా బ్యాంకులన్ని కలిసి సామాన్యుడి మీద దండయాత్ర మొదలుపెట్టడంతో.. బ్యాంకుల తీరును నిరసించేలా ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాంకులన్ని సామాన్యుడి మీద పగబట్టినట్లు వ్యవహరిస్తుండటంతో బ్యాంకుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే ఆ మెసేజ్:
'ఈ దేశానికి ఏమయింది? ఓ వైపు కేంద్రం, మరోవైపు ఎస్బీఐ... ఎవరూ నోరు మెదపరేంటి? బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయకండి, చేయనీకండి. బ్యాంక్ లావాదేవీలు చేసే వారిని ఎవ్వరినీ ఉపేక్షించకండి... నా పేరు భారతీయుడు. నేను ఒకప్పుడు బ్యాంకులో డబ్బులు బాగానే దాచుకునే వాడిని. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లయినా డిపాజిట్, విత్ డ్రా చేసే వాడిని. ఇక ముందు నేను అలా చేయలేనేమో. ఎక్కువ కాలం బ్యాంకు వాళ్ళు వడ్డించే ఛార్జీలను భరించలేను. అందుకే బ్యాంకులో డబ్బులు దాచుకోవటం మానేస్తాను. బ్యాంకుల్లో డబ్బులు దాచడం ప్రాణాంతకం. మీకు మాత్రమే కాదు... మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా'
బ్యాంకుల తీరును నిరసిస్తూ:
సర్వీస్ చార్జీలు, నగదు ట్రాన్సాక్షన్స్ పై పరిమితుల విధించడంతో సామాన్యులంతా బ్యాంకులపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. ఐసీఐసీఐ, హెచ్.డి.ఎఫ్.సి లాంటి బ్యాంకులు నాలుగు సార్ల కన్నా బ్యాంకు లావాదేవీలు జరిపితే రూ.150 అదనపు బాదుడు తప్పవని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అదే తోవలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్.బి.ఐ కూడా నడిచింది. నాలుగుసార్ల కన్నా ఏటీఎం లావాదేవీలు జరిపితే రూ.50 అదనపు బాదుడు తప్పదని ఆ సంస్థ ఛైర్మన్ అరుంధతీ భట్టాచర్య స్పష్టం చేశారు.
కనీస నిల్వలు లేకున్నా:
బ్యాంకుల బాదుడుతో ఒకేసారి డబ్బంతా తీసుకుని ఇంట్లో పెట్టుకుందామనుకున్నవారికి సైతం బ్యాంకులు షాక్ ఇచ్చాయి. ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే బాదుడు తప్పదని ఎస్.బి.ఐ ప్రకటించడంతో సామాన్యుల్లో అసహనం మరింత పెచ్చరిల్లింది.
మెట్రో పాలిటన్ నగరాల్లో అయితే కనీసం రూ.5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.3వేలు, సెమీ అర్బన్ రూ.2వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1వెయ్యి చొప్పున ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ తప్పదని స్టేట్ బ్యాంక్ స్పష్టం చేసింది.
'నో బ్యాంక్ డే' జరపాలని పిలుపు:
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మెసేజ్ బ్యాంకుల తీరుకు నిరసనగా 'నో బ్యాంకింగ్ డే' జరపాలన్న పిలుపునిస్తోంది. బ్యాంకులకు బుద్ది చెప్పాలంటే సామాన్యులంతా ఏకమై నో బ్యాంకింగ్ డేకు సహకరించాలని దాని ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను జనం విపరీతంగా ఆదరిస్తున్నారు.
ప్రత్యామ్నాయంగా.. ఇలా చేద్దామంటున్నారు:
నో బ్యాంకింగ్ డే జరిపే బదులు దానికి ప్రత్యామ్నాయంగా మరో ఆలోచనను కొంతమంది తెరపైకి తెస్తున్నారు. దీనికి బదులు ఖాతాల్లోని మొత్తం డబ్బును ఊడ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఆర్థిక సంవత్సరం చివర బ్యాలెన్స్ లు తగ్గితే, టార్గెట్లు పూర్తికాక, బ్యాంకులే మన దారిలోకి వస్తాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
బ్యాంకులు 'సేఫ్' అనుకుంటే.. ఇలా దోపిడీనా?
డబ్బు దాచుకోవడానికి బ్యాంకులు సేఫ్ అన్న ఉద్దేశ్యంతో డిపాజిట్లు చేస్తూ పోతే.. ఆ డబ్బులను బయట వడ్డీలకు ఇచ్చుకుంటూ, తిరిగి ఖాతాదారులపైనే చార్జీలు వేస్తారా? అంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 31లోగా డబ్బులని విత్ డ్రా చేసుకుని బ్యాంకులకు బుద్ది చెప్పాలని వారు పిలుపునిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారం ఎఫెక్ట్ బ్యాంకులపై 10శాతం పడినా.. బ్యాంకులు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.