ఉమ్మడి రాజకీయ శత్రువు చంద్రబాబు: జగన్, కెసిఆర్ దోస్తీ?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. నోటుకు ఓటు కేసులో తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు అయినప్పటి నుంచి ఆ విమర్శను ముందుకు తెచ్చారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇవ్వడాన్ని కుమ్మక్కు కావడంగా వారు అభివర్ణిస్తున్నారు.
రేవంత్ రెడ్డి అరెస్టు, ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్తో ఆయన జరిపిన సంభాషణల వీడియోల లీక్ తెలుగుదేశం పార్టీని తీవ్రమైన ఇబ్బందుల్లో పడేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చిక్కుల్లో పడినట్లు కనిపించారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణల దాడి నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు ట్విస్ట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.
నిజానికి, కెసిఆర్, జగన్మోహన్ రెడ్డిలకు ఉమ్మడి రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడే. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లుగా ఆ ఇరువురు చంద్రబాబుకు వ్యతిరేకంగా కలిసి పనిచేయడానికి అవకాశాలు ఉండవచ్చు. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కుంటున్న జగన్ తెలంగాణలో టిడిపిని దెబ్బ తీయడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకే సిద్ధపడుతారని భావించారు. టిఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దించి ఆ అవకాశాన్ని జగన్కు ఇచ్చారు. దాంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా తనకు గల కొద్దిపాటి శక్తినైనా ఉపయోగించుకున్నారని అనుకోవచ్చు.
అలాగే, తెలంగాణలో టిడిపిని నామరూపాలు లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న కెసిఆర్ జగన్ సహాయం తీసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. తమ ఐదో అభ్యర్థిని గెలిపించుకోవడానికి జగన్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే మద్దతును కూడా కెసిఆర్ పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదని చెప్పవచ్చు. ఆ రకంగా జగన్, కెసిఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి చేతులు కలపడం రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారు.