బీఆర్ఎస్ ను కేఏ పాల్ పార్టీతో పోల్చి.. మంత్రి మల్లారెడ్డికి పేర్ని నాని కౌంటర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి ఏపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించే ధైర్యం, దమ్ము తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఏపీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే దానిని అడ్డుకునే సాహసం ఎవరూ చేయడం లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీలో పట్టం కడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, సమస్యలు పరిష్కరించబడతాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాలు లోని ఎన్నికల బరిలో ఉంటామని వెల్లడించారు. ఇక తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి దొంగ కరెంటు తీసుకుంటున్నది మీరు కాదా
తెలంగాణ మంత్రుల పై విరుచుకుపడిన మాజీ మంత్రి పేర్ని నాని, తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమి ఉద్దరిస్తారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఏం ఉద్దరించారో చెప్పాలని నిలదీశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి దొంగ కరెంటు తీసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు, విభజనలో పేర్కొన విధంగా ఆస్తుల పంపకాలు ఇప్పటివరకు చేయలేదని పేర్ని నాని విమర్శించారు. ఏపీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని.. విద్యుత్ బకాయిలు చెల్లించలేదని.. అసలు మీరు ఏం చేశారు అంటూ పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేఏ పాల్ పార్టీ కూడా 175 స్థానాల్లో పోటీ చేసింది
బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చెయ్యడంలో తప్పు లేదని పేర్కొన్న పేర్నినాని కె.ఏ.పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశాడు అంటూ బీఆర్ఎస్ ను కే ఏ పాల్ పార్టీ తో పోల్చి పేర్ని నాని ఎద్దేవా చేశారు. తెలంగాణ మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడిన పేర్నినాని.. మోడీ, అమిత్ షా ఎప్పుడొస్తారో అని తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలే అని పేర్కొన్న పేర్ని నాని, ఏపీకి తెలంగాణ నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా తిట్టిపోసిన పేర్ని నాని
ఇప్పుడు తెలంగాణ మంత్రులు ఏపీని ఉద్దరిస్తాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, మీ వల్ల కాదా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడింది అంటూ పేర్నినాని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన పెద్దగా ప్రభావం ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాల్సిందే అంటూ పేర్ని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంగా ఏపీ లో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు ఏపీ వైసిపి నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. పోలవరం సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తేనే పూర్తవుతుందని, కాళేశ్వరం తరహాలో ఏపీలో పోలవరాన్ని పూర్తి చేస్తారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం చూపిస్తోందని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి కౌంటర్ గా పేర్ని నాని తెలంగాణా మంత్రులను తిట్టిపోశారు.