ముదురుతున్న మరో వివాదం... ప్రజాధనం దుర్వినియోగం..? నిమ్మగడ్డపై పోలీసులకు ఫిర్యాదు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ప్రజా న్యాయవేదిక అనే సంస్థ విజయవాడలోని సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించింది. హైదరాబాద్లో నివాసముంటున్న రమేష్ కుమార్... విజయవాడలో నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వం నుంచి అద్దెకు సంబంధించిన అలవెన్సులు పొందుతున్నారని ఆరోపించింది.
Recommended Video

నిమ్మగడ్డపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ప్రజా న్యాయవేదిక అధ్యక్షుడు బి.శ్రీనివాస్ సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ద్వారా ఈ ఫిర్యాదు అందినట్లు సూర్యారావు పేట పోలీసులు తెలిపారు. అయితే ఈ ఫిర్యాదుపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు.

గవర్నర్కు కూడా అందిన ఫిర్యాదు..
ఇదే అంశంపై సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక(యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్) కూడా గవర్నర్ విశ్వభూషణ్కు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో నివసించడం లేదని, కానీ ప్రతి నెలా ఇంటి అద్దె అలవెన్సు పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్న నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని కోరింది. నిమ్మగడ్డ ప్రభుత్వం నుంచి పొందుతున్న వేతన వివరాలకు సంబంధించిన కాపీలను కూడా గవర్నర్కు సమర్పించింది.

రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ఇలాగా...
'రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ప్రతీ నెలా రూ.3,19,250 జీతం పొందుతున్న నిమ్మగడ్డ రమేష్ అసలు రాష్ట్రంలో నివాసం ఉండట్లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు మారినా ఆయన మాత్రం అక్కడే ఉంటున్నారు. ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించాల్సిన కమిషనర్ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో లేకుండా హైదరాబాద్లో నివాసం ఉండటమేంటి...' అని సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక ప్రతినిధులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వానికి నిమ్మగడ్డకు యుద్దం...
ఏపీలో గత కొద్ది నెలలుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్కు,వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా యుద్దం సాగుతోంది. నిమ్మగడ్డ పదవీ కాలం(మార్చి 31,2021) పూర్తయ్యేంతవరకూ ఎన్నికలు నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. డిసెంబర్ 25వ తేదీ నుంచి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించడం... వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

వ్యాక్సినేషన్ అస్త్రంతో నిమ్మగడ్డకు భంగపాటు..
మరోవైపు నిమ్మగడ్డ మాత్రం తన పదవీ కాలం పూర్తయ్యే లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం పదేపదే కోర్టును ఆశ్రయిస్తూ ప్రభుత్వ మెడలు వంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెల్లకుండా చేయడంలో కోర్టుకు వెళ్లి విజయం సాధించారు.
తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తుండగా... దానిపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు అందుకు నిరాకరించగా.. మంగళవారం(డిసెంబర్ 15) జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు కోర్టుకు ప్రభుత్వం వివరించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు కొన్ని నెలలు పట్టే అవకాశం ఉండటంతో అప్పటిదాకా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంది.












Click it and Unblock the Notifications