'పవన్ జనసేన ప్రారంభోత్సవ సభపై విచారణ జరపండి'
హైదరాబాద్: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రారంభోత్సవ ఖర్చుపై విచారణ జరపాలని న్యాయవాది బద్దం నర్సింహా రెడ్డి శనివారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారన్నారు.
వివిధ చానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయని అందులో పేర్కొన్నారు. వేలమంది అభిమానుల సమక్షంలో నోవాటెల్ హోటల్లో పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారని, దీనికి సుమారు రూ.250 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు ఆరోపించారు.
మరోవైపు జనసేన పార్టీపై నర్సింహా రెడ్డి చేసిన ఫిర్యాదును ఆదాయపన్ను శాఖకు పంపనున్నట్లు ఈసి వర్గాలు తెలిపాయి. జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ఇప్పటికీ పూర్తి కాలేదని, ఆ పార్టీ పోటీ చేస్తుందో లేదో తెలియదని, అటువంటప్పుడు దీనిపై తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపాయి.
అలా అనలేదు: వెంకయ్య
పవన్ కొత్త పార్టీని ఉద్దేశించి తాను విమర్శలు చేయలేదని బిజెపి జాతీయ నాయకులు వెంకయ్య నాయుడు శనివారం స్పష్టం చేశారు. తనపై పవన్ చేసిన వ్యాఖ్యలకు వెంకయ్య వివరణ ఇచ్చారు. కొత్త పార్టీల ఏర్పాటుపై నెల్లూరులో తాను చేసిన వ్యాఖ్యలపై కొంత తప్పుడు సమాచారం బయటకు వచ్చిందని, తాను అనని మాటలను అన్నట్లు ప్రచురించారన్నారు. తానెప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా, కించపర్చేలా మాట్లాడబోనని చెప్పారు. కొత్తగా ఒకరు పార్టీ పెడుతున్నప్పుడు ఒక జాతీయ నాయకుడు చేసే వ్యాఖ్యలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఉంటుందన్నారు.