భార్య అస్థికలు పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఏపీలో షాకింగ్ కంప్లైంట్!!
మనకు విలువైన వస్తువులు ఏవైనా పోయినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా బంగారం, నగలు, నగదు, వాహనాలు వంటి వాటిని ఎవరైనా చోరీ చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, దొంగని పట్టుకొని తమ వస్తువులు తమకు ఇప్పించాలని కోరుతూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసుల వద్ద ఒక విచిత్రమైన ఫిర్యాదు నమోదు అయ్యింది. ఇక ఆ ఫిర్యాదు ఏమిటో తెలిస్తే సామాన్యులు కూడా షాక్ అవ్వడం పక్కా..
భార్య అస్థికల కోసం భర్త ఫిర్యాదు
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఒక అనూహ్యమైన ఫిర్యాదు చేశారు. తన భార్య అస్థికలు పోయాయని కంప్లైంట్ ఇచ్చారు. న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న కోడూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తన భార్య వెంకటలక్ష్మి ఈనెల 14వ తేదీన మృతి చెందడంతో 15వ తేదీన పాలకొల్లు కైలాసవనంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత 16వ తేదీన చిన్న కర్మ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత భార్య అస్థికలను స్మశాన వాటిక లో భద్రపరచాలని కాటికాపరి కి చెప్పి వచ్చారు.
కాటికాపరి భార్య ఆస్థికలను భద్రం చెయ్యమని చెప్పినా చెయ్యలేదని ఫిర్యాదు
ఇక తాజాగా ఆదివారం నాడు ఉదయం భార్య అస్థికలను గోదావరి లో కలపడం కోసం స్మశానానికి వెళ్లిన వెంకటేశ్వరరావు సదరు కాటికాపరిని తన భార్య అస్థికలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆ కాటికాపరి అస్థికలు కనిపించడం లేదని, అవి ఎక్కడో పోయాయి అని చెప్పి వెంకటేశ్వరరావుతో చెప్పడంతో, ఒక్కసారిగా వెంకటేశ్వరరావు ఖంగుతిన్నారు. అసలు అలా ఎలా పోతాయి అంటూ కాటికాపరిని వెంకటేశ్వరరావు గట్టిగా నిలదీశారు. దీంతో కాటికాపరి తాను భద్రంగానే పెట్టానని, కానీ అవి దొరకడం లేదని వెంకటేశ్వరరావు చెప్పారు.
పోలీసులను ఆశ్రయించిన భర్త.. తన భార్య అస్థికలు కావాలని కంప్లైంట్
దీంతో ఆగ్రహించిన వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో తన భార్య అస్థికలు పోయాయని, వాటిని తిరిగి తెచ్చి ఇవ్వాలని వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కూడా షాక్ తిన్నారు. అయితే వెంకటేశ్వరరావు తన భార్య అస్థికలు తనకెంతో ముఖ్యమైనవి అని చెప్పడంతో పోలీసులు అవి ఎలా పోయాయి అన్న అంశంపై దృష్టిసారించారు. అయితే ఈ వింత ఫిర్యాదు మనకు షాకింగ్ అనిపించినా, హిందూ ధర్మంలో ఎవరైనా చనిపోయిన వారి అస్థికలను పవిత్ర నదులలో కలిపితే మృతి చెందిన వారికి మోక్షం లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఇక ఈ మేరకే వెంకటేశ్వర ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అస్థికల కోసం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది.