నిషిత్ మంచివాడు.. నా కళ్ల ముందే పెరిగిన వాడు, అలాంటిది ఈ రోజు... : నారా లోకేష్
‘చాలా కష్టపడే మనస్తత్వం, ఎవరినీ బాధపెట్టే వ్యక్తి కాదు. నిన్న కూడా ఆఫీసులో కూర్చొని పదకొండు గంటల వరకు పనిచేశాడు. అలాంటిది, ఈ రోజు హఠాత్తుగా యాక్సిడెంట్ లో చనిపోవడం చాలా బాధాకరం’- నారా లోకేష్.
నెల్లూరు: నిషిత్ నారాయణ చాలా మంచి వ్యక్తి అని, ఎవరినీ బాధ పెట్టే వ్యక్తి కాదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులో నిషిత్ భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.
'ఈ సంఘటన చాలా బాధాకరం. నారాయణ గారికి నాకు పరిచయం దాదాపు ఏడు సంవత్సరాల నుంచి. మొదటిసారి నారాయణ గారి ఇంటికి నేను వెళ్లింది 1999లో. అప్పుడు నిషిత్ వయసు బహుశ మూడున్నరో, నాలుగు సంవత్సరాలో. నా కళ్ల ముందే పెరిగాడు. చాలాసార్లు కలిశాము.' అన్నారు.
'చాలా కష్టపడే మనస్తత్వం, ఎవరినీ బాధపెట్టే వ్యక్తి కాదు. నిన్న కూడా ఆఫీసులో కూర్చొని పదకొండు గంటల వరకు పనిచేశాడు. అలాంటిది, ఈ రోజు హఠాత్తుగా యాక్సిడెంట్ లో చనిపోవడం చాలా బాధాకరం' అని లోకేష్ తన బాధను వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రముఖుల నివాళి
నెల్లూరులో నిషిత్ నారాయణ భౌతికకాయానికి ఏపీ మంత్రులు, ఎంపీలు సందర్శించి నివాళులర్పించారు. నిషిత్ కు నివాళులర్పించిన వారిలో చిన రాజప్ప, నారా లోకేశ్, పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, కామినేని శ్రీనివాసు, ఎంపీలు కేశినేని నాని, సీఎం రమేష్ ఉన్నారు.